నిబంధనలపై ప్రయి’వేటు’

May 21,2024 21:55
నిబంధనలపై ప్రయి'వేటు'

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ర్యాంకుల సునామీ, అత్యుత్తమ ఫలితాల్లో మాదే అగ్రగామి, రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు మా విద్యార్థులకే సొంతం అంటూ అందమైన ప్రకటనలతో విద్యార్థులకు గాలం వేస్తున్న పలు, ప్రైవేటు కార్పొరేట్‌ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో నడుపుతున్న కొన్ని ఇంటర్‌ కళాశాలల్లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం శోచనీయం. ఇంటర్‌ బోర్డు నిబంధనలు పట్టని ఆయా కళాశాలలు అడ్డుగోలుగా అడ్మిషన్లను దండుతున్నాయి. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో సుమారు 200 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలున్నాయి. వీటన్నింటిలోనూ దాదాపు 50 వేలు మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా పలు ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అసౌకర్యాల నడుమపలు ప్రైవేటు కళాశాలల్లో ఇరుకు గదులుల్లోనే నిర్వహిస్తున్నారు. ఫ్యాన్లు, మరుగుదొడ్ల కొరత వేధిస్తోంది. సిబ్బంది కొరత మరీ తీవ్ర తరంగా ఉంది. విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలు సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుండడంతో తక్కువ మందిని నియమిస్తున్నారు. ఇలా పలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు సక్రమంగా లేక అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగునీరు కూడా లేని పరిస్థితి కొన్ని కళాశాలల్లో కనిపిస్తుంది. ఇళ్ల నుండి తెచ్చుకుంటున్న నీటిపైనే ఆధారపడాల్సి వస్తుందని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. సెక్షన్‌కు 80 మంది విద్యార్థులు, కోటా ప్రకారం సీట్ల కేటాయింపు బిల్డింగ్‌ పర్మిషన్‌, లీజ్‌ అగ్రిమెంట్‌, ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్‌, పార్కింగ్‌ స్థలం, ఫర్నిచర్‌, కంప్యూటర్‌ గది, సిబ్బంది ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, నాణ్యతమైన బోధనను అందించే అధ్యాపకులు లేని కళాశాలలు జిల్లాలో అనేకం ఉన్నాయి. వీటిపై పరిశీలన జరిపి అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు కాకినాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కొన్ని కళాశాలలు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్‌ కళాశాలలు బ్రాంచీల పేరుతో ఒకటి రెండు కళాశాలలకు అనుమతులు తీసుకుని, 4, 5 కళాశాలల ద్వారా అడ్మిషన్లు చేసి తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటువంటి కళాశాలలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ వంటి విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కళాశాలలకు గుర్తింపులేని లేకపోతే విద్యార్థులు నష్టపోయే అవకాశాలున్నాయి. ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు సక్రమంగా అందే అవకాశం ఉంటుంది. గుర్తింపు లేని కళాశాలలో చేరిన విద్యార్థులకు ఉపకార వేతనాలు రాక, సర్టిఫికెట్లు అందక ఉన్నత విద్యలో చేరేందుకు అడ్డంకులు ఏర్పడతాయి. ఇలా అనేక సమస్యలు వస్తాయి.అనుమతుల్లేని హాస్టళ్లుకాకినాడ జిల్లాలో దాదాపు అన్ని ప్రైవేటు కళాశాలలు అనుమతులు లేకుండానే హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. శ్రీ చైతన్య, అగస్త్య, వైవిధ్య, అఖిల్‌, ఆచార్య తదితర కళాశాలలు ఇంటర్‌ బోర్డు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే హాస్టళ్లు నిర్వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇలా జిల్లాలో ఉన్న పలు ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు వ్యాపారమే పరమావధిగా ఇంటర్‌ బోర్డు నిబంధనలకు నీళ్లొదిలేలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మాయ ప్రకటనలతో మభ్యపెట్టే యత్నంపలు కళాశాలలు ఆకర్షణీయమైన ప్రకటనలను అదర గొడుతున్నాయి. అత్యధిక మార్కులు తమ సొంతం అంటూ ఉదర గొగుతున్నాయి. ఈ మాయలో పడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి లక్షలు దండుకుంటున్నాయి. కార్పొరేట్‌ సంస్థల్లో కాబోయే ఇంజినీర్లు, డాక్టర్లుగా తల్లిదండ్రులు ఊహించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కళాశాలలకు అనుమతులున్నాయో లేవో చూసుకోవడంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అనుమతులున్న కార్పొరేట్ల మాయ మాటలు సైతం నమ్మి మోసపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలే ఉత్తమంఅనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్రశాంతమైన తరగతి గదులు, సైన్స్‌ విద్యార్థులకు అన్ని రకాల ల్యాబ్‌ సదుపాయాలతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలను అందించే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలే ఉత్తమమైనవని ప్రభుత్వ అధికారులు, అధ్యాపకులు తెలుపుతున్నారు. పైసా ఫీజు చెల్లించనవసరం లేకుండా చదువుల్లో కొనసాగవచ్చు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ముందస్తు ప్రణాళికతో కృషి చేస్తున్నారు.

➡️