మరోసారి అవకాశమివ్వండి

Apr 19,2024 21:58

బహిరంగసభలో బొత్స సత్యనారాయణ

అట్టహాసంగా నామినేషన్‌

ప్రజాశక్తి-చీపురుపల్లి :  రాష్ట్రాభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం మరొక్కసారి వైసిపికి అవకాశం ఇవ్వాలని వైసిపి అభ్యర్థి, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన వైపిపి అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆర్‌డిఒ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి బి.శాంతికి తన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అంతకుముందు చీపురుపల్లి మూడు రోడ్ల కూడలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్య క్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. గతంలో కూడా తాను నామినేషన్‌ వేసినప్పుడు చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆశీర్వదించారని, ఈ సారి కూడా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ ఐదేళ్లు పాటు జరిగిన అభివృద్ధి పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. మూడు దఫాలుగా తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, ఈ కాలంలో నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కరించామని తెలిపారు. మళ్లీ తనను, విజయగనగరం పార్లమెంటు అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. నామినేషన్‌ వేసిన అనంతరం విలేకర్లతో మంత్రి బొత్స మాట్లాడుతూ చీపురుపల్లి నియోజకవర్గంలో అన్ని విధాల సంక్షేమ పధకాలు, అభివృద్ధి చేసాననే నమ్మకంతో నామినేషన్‌ వేసానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలనను చూసి కన్నుకుట్టి చంద్రబాబునాయుడు అండ్‌ కో చెప్పడానికి ఏమీ లేక, చేసిందేమీలేక లేని పోని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజకవర్గంగా తయారు చేస్తానని బొత్స అన్నారు. కార్య క్రమంలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, నాలుగు మండలాల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మీసాల వరహాలనాయుడు, మీసాల విశ్వేశ్వరరావు, ఎస్‌విరమణరాజు, బూర్లె నరేష్‌, తాడ్డి వేణుగోపాలరావు, పొట్నూరు సన్యాసినాయుడ నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️