ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరంలోని టెంపుల్ వద్ద అనుమానితుల వద్ద భారీగా బంగారం, నగదును పోలీసులు సీజ్ చేసిన ఘటన శనివారం రాత్రి జరిగింది. విజయనగరం పట్టణంలోని కన్యక పరమేశ్వరి టెంపుల్ వద్ద ఏప్రిల్ 12న రాత్రి జిల్లా ఎస్పీ ఆదేశాలతో వన్ టౌన్ సిఐ బి.వెంకటరావు ఆధ్వర్యంలో ఎస్సై నవీన్ పడాల్ , సిబ్బంది వాహన తనిఖీలు చేపడుతూ, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని ఆపి, తనిఖీ చేశారు. అతని వద్ద 2.663 కిలోల బంగారు వస్తువులు, రూ.17,95,000ల నగదు సీజ్ చేశారు. బంగారు వస్తువులు, నగదుకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పంచనామా రిపోర్ట్ రాసి, డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ కమిటీ, ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటుకు తదుపరి చర్యలు నిమిత్తం పంపినట్లుగా సిఐ బి.వెంకటరావు తెలిపారు. పట్టుబడిన వ్యక్తి భీమిలి మండలం అన్నవరం గ్రామానికి చెందిన అమర రాజయ్య అని, అతను విశాఖపట్నం గోల్డ్ గెయిన్ అనే జ్యువలరీ షాపులో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నట్లు, సదరు షాపు యజమాని పవన్ కుమార్ విజయనగరంలోని బంగారు షాపులకు వస్తువులను విక్రయించి, డబ్బులు తీసుకొని రావాలని చెప్పడంతో వాటిని విజయనగరం తీసుకొని వచ్చినట్లుగా విచారణలో వెల్లడించారని సిఐ బి.వెంకటరావు తెలిపారు. సీజ్ చేసిన బంగారు వస్తువుల విలువ రూ. 1 కోటి 51 లక్షల 10 వేలు గా అంచనా వేశామని తెలిపారు.