ప్రజాశక్తి – కాకినాడ
రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్లో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా నేటికీ రజకులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, చాలా వెనకబడి ఉన్నారన్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా రజకుల అభివృద్ధి చెందడం లేదన్నారు. వృత్తి నిర్వ హణలో యంత్రాలు ప్రవేశించడం వల్ల ఉపాధికి గండి పడిందని అన్నారు. రజక వృత్తిదారులకు స్టీమ్ ఐరన్ ఇస్త్రీ చేసేందుకు 250 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని, అర్బన్ కేంద్రాల్లో మోడ్రన్ ధోబి గార్డ్స్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రం లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ సంస్థలు. దేవస్థానాల్లో ఉన్న రజక వృత్తి ఉపాధిని రజక కుటుంబాల్లో ఉన్న యువతి యువకులకు కల్పించాలని రాజు డిమాండ్ చేశారు. రజక వృత్తి చెరువులు, కుంటల స్థలాలపై రజకులకే పూర్తి హక్కు కల్పించాలని, 50 సంవత్సరాల పూర్తయిన రజకులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో కె.మా ణిక్యం, కె.త్రిమూర్తులు, వి.రాజు, ఎస్. రాజేష్, సిహెచ్.శ్రీను, గంగాధర్ రావు పాల్గొన్నారు.