ప్రజాశక్తి – కాకినాడ
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిఐటియు నాయకులు కోరారు. బుధవారం ఎంఎల్ఎ వనమాడి వెంకటేశ్వర రావును సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి నేతృత్వంలో సిఐటియు నగర నాయకులు ఆయన నివాసంలో కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బేబిరాణి మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. జిజిహెచ్, నగర పాలక సంస్థ వంటి ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా, విఒఎ, మధ్యాహ్న భోజన పథకం వంటి స్కీం వర్కర్స్ వేతనాలు, ప్రమోషన్లు, ఉద్యోగ భద్రత వంటి విషయాల్లో గత ప్రభుత్వానికి భిన్నంగా కార్మిక శ్రేయస్సు కోసం పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ వనమాడి మాట్లాడుతూ ఆయా శాఖల మంత్రులు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్న తరువాత రంగాల వారీగా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంఎల్ఎను కలిసిన వారిలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, ఆశా వర్కర్స్ జిల్లా నేత చంద్రమళ్ళ పద్మ, మధ్యాహ్న భోజన పథకం నాయకురాలు నర్ల ఈశ్వరి, క్లాప్ వాహన డ్రైవర్ టి.శ్రీనివాస్, యుపిహెచ్సి ఎంప్లాయీస్ నాయకులు జివివి.సత్యనారాయణ, అంగన్వాడీ నగర నాయకులు రమణమ్మ, నీరజ, జ్యోతి, రమ, సరోజ, విజయ, ఆశా యూనియన్ నగర నాయకులు భారతి, పద్మ, పాప, రాణి, వేణు, లీలావతి, మీనాక్షి పాల్గొన్నారు.