ప్రజాశక్తి-పిఠాపురంసార్వత్రిక ఎన్నిక నేపథ్యంలో పిఠాపురంలో అధికారులు భారీ ఎత్తున గుర్తించిన అక్రమ మద్యం నిల్వలపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎంఎల్ఎ ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. స్థానిక సాయిబాబా గుడి సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద వర్మ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో నిన్నటి రోజున ప్రభుత్వాధికారులు అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ.కోటి విలువైన మద్యం బాటిల్స్ను సీజ్ చేశారన్నారు. తాను 20 రోజులు క్రితమే డెమో వెహికల్ వచ్చంది, ఈ వాహనం అడ్డుపెట్టి అధికారుల దష్టి మళ్ళించి మందు బాటులు, డబ్బు వచ్చిందని చెప్పానని గుర్తు చేశారు. నేడు అదే నిజమైందన్నారు. ఆ మందు ఈ రాష్ట్రంలోది కాదని, గోవాకు చెందినదని ప్రజలు ఈ కల్తీ మద్యం తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నామన్నారు. పవన్ కళ్యాణ్ను ఓడించెందుకే అక్రమ మద్యం నిల్వలు, డబ్బులు పంచి పెడుతున్నారని ఆరోపించారు. సదరు సంఘటనపై అధికారులు పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేసి అందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోబాలకు గురి చేసినా పవన్ రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొండేపూడి ప్రకాష్, ఎస్.గంగాధరరావు, ప్రకాష్, బంగారు బాబు, కృష్ణ, దానం లాజర్ బాబు తదితరులు పాల్గొన్నారు.