ప్రజాశక్తి-పిఠాపురం ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభ నేపథ్యంలో సభా స్థలానికి సుమారు వంద మీటర్ల దూరంలో ఉన్న చిన్నమాంబ పార్కు చుట్టూ, ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ ప్రభుత్వ కళాశాల బయట ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను శనివారం మున్సిపల్ అధికారులు తొలగించారు. ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్లో సిఎం సభ ఉందని దుకాణాలు తెరవద్దు అని కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులు తమ దుకాణాలు తొలగించారని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. తాము ఆశీలు చెల్లిస్తూ టిఫిన్, టీస్టాల్, బజ్జీ బండి, నూడుల్స్ బండి, చెప్పులు కుట్టుకుంటూ, పువ్వులు అమ్ముతూ వచ్చే చాలి చాలని సంపాదనతో కడుపు నింపుకుంటున్నామని, అధికారులు చేసిన పనితో తమ జీవనాధారాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నామని ఎన్నో సభలు సమావేశాలు జరిగాయని ఎప్పుడు అధికారులు ఎవరు తమ దుకాణాలు తొలగించలేదన్నారు. అధికారులు కనీసం ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే ఉదయం టిఫిన్లు, టీలు పెట్టేందుకు సామగ్రి సిద్ధం చేసుకోకుండా దుకాణాలు మూసి వేసే ఉండేవారిమన్నారు. అధికారులు చర్యలతో నష్టపోయామని వ్యాపారులు కన్నీరు పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.