ప్రజాశక్తి-అమలాపురం శిరోముండనం కేసులో తీర్పుపై ప్రభుత్వం వెంటనే అప్పీల్ చేయాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. శిరోముండనం బాధితులతో కలిసి శనివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో డిఆర్ఒ వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ ముద్దాయిలకు ట్రయల్ కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరితూగేలా లేదని, పైగా నేరస్తులే శిక్షను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వమే నేరస్తులకు కొమ్ముకాస్తే సామాన్యులకు దిక్కెవరు అని ప్రశ్నించారు. శిరోముండనం కేసులో జైలు శిక్ష పడిన తోట త్రిమూర్తులుకు ఎంఎల్ఎ సీటిచ్చి వైసిపి తన నైజాన్ని చాటుకుందన్నారు. ప్రభుత్వ సహకారంతోనే త్రిమూర్తులు హైకోర్టులో అప్పీల్కు వెళ్లారన్నారు. అధికార యంత్రాంగం ఎస్సి, ఎస్టి అట్రాసిటీకి పాల్పడితే చట్ట ప్రకారం తీవ్రంగా పరిగణిస్తుందని, ఎంఎల్ఎ హోదాలోనే తోట త్రిమూర్తులు అట్రాసిటీ నేరానికి పాల్పడడంతో మరింత తీవ్రంగా శిక్షలు ఉండాలన్నారు. కానీ ట్రైల్ కోర్టు కేవలం 18 నెలలు సాధారణ శిక్ష విధించినందున ట్రైల్ కోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీల్కు వెళ్లాలని డిమాండ్ చేసారు. ఈ మేరకు అమలాపురంలో జిల్లా కలెక్టర్, ఎస్పిలకు వినతిపత్రం అందజేసి నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో విదసం ఐక్య వేదిక సహాయ కన్వీనర్ బళ్ల కుమార్, కె.రాము, వి.రామకృష్ణ, బాధితులు కె.చినరాజు, సిహెచ్.పట్టాభి రామయ్య, హెచ్ఆర్ఎఫ్ నాయకులు రాజేష్, ఇక్బాల్, పిడిఎస్యు నుంచి రేవు తిరుపతి రావు, జె.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.