- 5వ రోజుకు పారిశుధ్య కార్మికులు సమ్మె
ప్రజాశక్తి – మండపేట : తమ సమస్యల తక్షణo పరిష్కరించాలని నల్ల రిబ్బన్లు కళ్ళకు కట్టుకుని మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు నిరసన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎం.భాస్కరరావు మాట్లాడుతూ నిత్యం పట్టణ పరిశుభ్రత కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పని చేసే పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల రాతలు మారడం లేదన్నారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలన్నారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈ ఎస్ ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. మరిన్ని సంఘాలను కలుపుకొని డిమాండ్ల సాధన లక్ష్యంగా సమ్మె ఉధృతం చేసేందుకు ముందుకు సాగుతున్నమన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కొమరపు నరేంద్ర కుమార్, బంగారు కొండ, లోవరాజు, విజయ్, సవరపు సరోజినీ తదితరులు పాల్గొన్నారు.