చెముడులంక పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు
ప్రజాశక్తి-ఆలమూరు
మండలంలోని పోలింగ్ కేంద్రాలను మండల ఎన్నికల అధికారి, తహశీల్దార్ డివిఎన్.అనిల్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్లు విజయ రేఖ, జానకి రాఘవలతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల పరిశీలించారు. ఆయన ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నట్లు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ విలేకరు లతో మాట్లాడుతూ 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించు కోవాలన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు, గాలి పుష్కలంగా ఉండాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పకుండా అందుబాటులో ఉండాలన్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక అధికారులకు ఆయన ఆదేశించారు. మండలంలో గల 62 పోలింగ్ కేంద్రాలలో ఆలమూరు, పినపళ్ళ, గుమ్మిలేరు, నర్సిపూడి, చొప్పెల్ల, చెముడులంక, మడికి, బడుగువానిలంక, మూలస్థాన అగ్రహారంలో గల 31 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. వాటన్ని టిని పరిశీలించామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ సందీప్ కుమార్, బిఎల్వోలు రాంపండు, భారతి, తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.