సమస్యాత్మక కేంద్రాలపై సమావేశం నిర్వహిస్తున్న అధికారులు
– తహశీల్దార్ పద్మజ, ఎస్ఐ మహ్మద్ రిజ్వాన్
ప్రజాశక్తి – చిప్పగిరి
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తహశీల్దార్ పద్మజ, ఎస్ఐ మహ్మద్ రిజ్వాన్ తెలిపారు. మండలంలోని 13 పంచాయతీల్లో గతంలో రికార్డుల్లో నమోదయిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ పద్మజ, ఎస్ఐ మహ్మద్ రిజ్వాన్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఏమైనా సంఘటనలు, ఘర్షణలు జరిగాయా, వాటి వల్ల రీపోలింగ్ జరిగాయా అన్న కోణంలో ప్రతి గ్రామస్తునితో కూడా మమేకమై తెలుసుకొని ఒక నివేదిక ప్రకారం ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపులో పోలీసు శాఖ నుంచి ఒకరిని కేటాయిస్తామని చెప్పారు. సెక్టోరియల్ అధికారులకు ఇప్పటి నుంచి గ్రామాల్లో ఏ సమాచారం వచ్చినా ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. సమస్యాత్మక గ్రామాలపై పూర్తి నిఘా ఉంచి సమాచార సేకరణ ఉండేలా చూసుకుంటున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో పోలీసు భద్రత కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఎంఇఒలు సావిత్రమ్మ, బాలనాయుడు, ఎఒ జయలక్ష్మి, పిఆర్ ఎఇ చోళ రెడ్డి, డిటి అజీజ్ అహ్మద్, ఎఎస్ఐ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.