ఒంటి కాళ్లపై నిరసన వ్యక్తపరుస్తున్న అంగన్వాడిలు
ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అత్యంత హేయమైన చర్య
ప్రజాశక్తి – ఆత్మకూర్
అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అత్యంత హేయమైన చర్య అని ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి మంజుల, నాయకురాలు వెంకటలక్ష్మి, ప్రమీలమ్మ, సిఐటియు పట్టణ అధ్యక్షులు రజాక్, కార్యదర్శి రామ్ నాయక్, ఉపాధ్యక్షులు రణధీర్ లు అన్నారు. ఆదివారం పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని 27వ రోజు నిరవధిక సమ్మె చేపట్టి ఒంటి కాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జీవో నెంబర్2 ప్రభుత్వం ఉపసంహరించు కోవాలన్నారు. 27రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు అత్యవసర సేవలంటూ ఎస్మా ప్రయోగించడం సిగ్గుచేటని వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలన్నారు. నిరవధిక సమ్మెను అణిచివేయాలని ప్రభుత్వం ఎన్ని జీవోలు తీసుకుని వచ్చిన సమ్మె మరింత ఉధృతం చేస్తామని, సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు విజయలక్ష్మి, లక్ష్మీదేవి, సుజాత, లక్ష్మి, ప్రియాంక, రవణమ్మ, అరుణ, సిఐటియు నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.