వివరాలు వెల్లడిస్తున్న దృశ్యం
నకిలీ ఆర్టిఎ అధికారులు అరెస్టు
ప్రజాశక్తి – ఆళ్లగడ్డ
మండలంలోని చింతకుంట సమీపంలో ఆర్టిఎ శాఖ అధికారులమని చెప్పి వాహన తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ముఠాను శనివారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి వెంకటరామయ్య మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన చెందిన విల్సన్ కుమార్, దూదేకుల ఉసేనయ్య, చిన్న వెంకటేశ్వర్లు ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో వాహనాలను ఆపి ఆర్టిఎ అధికారులమంటూ బెదిరించే వారన్నారు. పెద్ద చింతకుంట శివారులోని కాశీనాయన ఆశ్రమం వద్ద వాహనాలను ఆపి డ్రైవర్లను బెదిరిస్తుండగా పట్టణ ఎస్ఐ వెంకటరెడ్డి సమాచారం అందుకొని సిబ్బందితో దాడి చేసి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. వారి నుండి కారును, రెండు సెల్ ఫోన్లను, రూ. 2200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలై డబ్బు కోసం మోసం చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన హెడ్ కానిస్టేబుల్ హుస్సేని, కానిస్టేబుల్ ఉదరు మునీశ్వర్, హోంగార్డులు ప్రసాద్, ఓబులేసు, రుద్రుడులను డిఎస్పి అభినందించారు. సమావేశంలో టౌన్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐ వెంకటరెడ్డి పాల్గొన్నారు.