- పుస్తకాలు, యూనిఫాంల పేరుతో గుంజుడు : ఎస్ఎఫ్ఐ
ప్రజాశక్తి- నందిగామ : ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వ్యాపారానికి సిద్ధమై పుస్తకాలు, యూనిఫాంల పేరుతో గుంజుతున్నారని ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గోపి నాయక్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాఠశాల పరిధిలో పుస్తకాలు అమ్మకాలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని తెలిపారు. నందిగామ నియోజకవర్గంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యం పుస్తకాలు, ఫీజులు, యూనిఫాంల పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తోందన్నారు. వేలాది రూపాయలు అడ్డగోలుగా ముక్కుపిండి గుంజుతుందన్నారు.దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లి పోతున్నారని తెలిపారు. విద్యార్ధుల తల్లితండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలనే మోజులో నానా అవస్ధలు పడి వేలాది రూపాయలు చెల్లిస్తున్నారని తెలిపారు. విద్యార్ధుల తల్లితండ్రుల బలహీనలతను ఆసరాగా తీసుకోని కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారని తెలిపారు. అధికశాతం ప్రైవేట్ పాఠశాలలకు ఆటస్ధలం కాని కనీస మౌలిక వసతులు గాని లేవన్నారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలపై ఉన్న ప్రేమతో అనుమతులు ఇస్తున్నారు ఇదంతా ఒక ఎత్తుకాగా పుస్తకాలు, యూనిఫాం పేరుతో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా దోపిడీ చేయడానికి సిద్దం అయ్యారని తెలిపారు.