ప్రజాశక్తి -కరాస: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 6, 7, 8 తేదీల్లో జరిగే ధర్నాలో విశాఖ నుంచి ఎక్కువ మంది పాల్గొనాలని పెన్షనర్లు నిర్ణయించారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (ఎపిఆర్పిఎ) విశాఖ జిల్లా కమిటీ సమావేశం శాంతినగర్ హష్మీ భవనంలో కె.దీనబందు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా రాష్ట్ర సంఘం కోశాధికారి సత్యనారాయణరాజు మృతి పట్ల సంతాపం తెలిపి, ఆయన సేవలను కొనియాడారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి కె.సుధాకర్ మాట్లాడుతూ, ఎఐసిసి నిర్ణయాలు వివరించారు. జిల్లా అధ్యక్షుడు కె.దీనబందు రాష్ట్ర కమిటీ వివరాలు తెలిపారు. అనంతరం కొత్తగా విజయం సాధించిన పార్లమెంట్ సభ్యులకు ఇపిఎస్ పెన్షనర్ల డిమాండ్లపై వినతిపత్రాలు సమర్పించాలని, ఆగస్టు 6, 7, 8 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో విశాఖ నుండి ఎక్కువ మంది పాల్గొనాలని, ఢిల్లీ వెళ్లేవారికి ఫండ్ కలెక్ట్ చేసి ఒక పక్క రైల్వే ఛార్జీ ఇవ్వటానికి నిర్ణయించారు. వెంటనే సమావేశంలో ఉన్న నాయకులు బాబూరావు, జి.సూర్యచంద్రరావు, జి.సూర్యప్రకాశరావు, కెపి.కుమార్ స్పందించి విరాళాలు అందజేశారు. విరాళాలిచ్చిన వారికి జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఎక్కువ సభ్యత్వం చేయించిన బాబాజీని సన్మానించారు.