మార్కాపురం డి.ఎస్.పి. పి బాలసుందర్రావు
ప్రజాశక్తి-మార్కాపురం : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని మార్కాపురం డి.ఎస్.పి బాల సుందర్ రావు కోరారు. బుధవారం మండల పరిధిలోని పెద్దనాగులవరం గ్రామం నందు కేంద్ర, రాష్ట్ర బలగాలతో పోలీస్ కవాతు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి బాలసుందర్రావు మాట్లాడుతూ ఎన్నికలలో ఎవరికి వారు స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకొనే వాతావరణం కల్పిస్తామన్నారు. గొడవలు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. ప్రజల సహకారం ఉంటే ఎన్నికలు సమర్ధవంతంగా జరుగుతాయన్నారు. గ్రామంలో వర్గవిభేదాలు లేకుండా మీకు నచ్చిన వ్యక్తులకు ఓటు వేసుకో వాలన్నారు. పట్టింపులకు వెళ్లకుండా ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు, గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం.వెంకటేశ్వర్ నాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.