ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : దేశంలో అన్ని వర్గాల ప్రజలకు బిజెపి తీరని అన్యాయం చేసిందని నరసాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు అన్నారు. శనివారం నరసాపురం పట్టణంలో టైలర్ హై స్కూల్ వద్ద నరసాపురం నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి కానూరి ఉదయ భాస్కర్ కృష్ణ ప్రసాద్ (బుజ్జి) సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచార రథంతో రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షో పట్టణంలోని వైఎన్ కాలేజి రోడ్డు, వలంధర్ రేవు, స్టీమర్ రోడ్డు, మెయిన్ రోడ్, పాత బజార్, పీచుపాలెం మీదుగా లక్ష్మణేశ్వరం చేరుకుంది. ఈ సందర్భంగా కేబీఆర్ నాయుడు మాట్లాడుతూ … ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల 8333 రూపాయలు, ప్రతి సంవత్సరం మహిళా మహాలక్ష్మి పథకం ద్వారా ఒక లక్ష రూపాయలు అందిస్తామన్నారు. ఇళ్లు లేనివారికి రూ.5 లక్షలతో ఇళ్ళు నిర్మాణం చేపడతామన్నారు. కేజీ నుండి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామన్నారు. గోదావరి పై వశిష్ఠ వారధి నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి ఉపాధి హామీ కూలీకు రోజుకు కనీస వేతనం రూ.400 అందిస్తామన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు పెన్షన్, వికలాంగులకు రూ.6 వేలు పెన్షన్ అందిస్తామన్నారు.