ప్రజాశక్తి-బొబ్బిలి : ఆర్టిసి బస్సుల కోసం ప్రయాణికులకు రెండోరోజు తిప్పలు తప్పలేదు. శ్రీకాకుళం జిల్లాలో సిఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఆర్టిసి బస్సులను రెండోరోజూ మళ్లించారు. దీంతో బస్సుల కోసం ఆర్టిసి కాంప్లెక్స్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సులు లేకపోవడంతో ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆర్టిసి అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేగిడి : ఆర్టిసి బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సిఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం సభలు, బస్సు యాత్రకు జనాన్ని తరలించడానికి పాలకొండ, రాజాం, విజయనగరం, శ్రీకాకుళం డిపోల నుంచి పెద్ద ఎత్తున బస్సులను తరలించారు. దీంతో ప్రయాణికులకు సకాలంలో బస్సులు అందక అవస్థలు పడ్డారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు కిలోమీటర్ల మేర నడవవలసిన పరిస్థితి నెలకొంది.. ఒక పక్క ఎండ మరో పక్క బస్సులు లేకపోవడంతో నిరీక్షించేందుకు ప్రయాణికులు విసుగు చెందారు. సిఎం సభలు పెడితే ఇలా ప్రతి రోజూ బస్సులను తరలిస్తారా అని మండిపడ్డారు.