కలెక్టర్ అరుణ్బాబు
పుట్టపర్తి అర్బన్ : ఓటుహక్కు పొందేందుకు ఎన్నికల కమిషన్ చివరి అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా ఈ నెల 14వ తేదీ లోపు ఓటు కోసం ధరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పి.అరుణ్ బాబు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదన్నారు. అత్యంత విలువైన, అమూల్యమైన ఓటుహక్కును 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ పొందాలన్నారు. 14వ తేదీలోపల ధరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎన్నికల కమిషన్ ఓటు హక్కు కల్పిస్తుందని చెప్పారు. కొత్త ఓట, చిరునామా మార్పు కోసం ఈ నెల 14వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. ఏప్రెల్ 14వ తేదీ తరువాత వచ్చే దరఖాస్తులను ఎన్నికల తరువాత మాత్రమే పరిశీలిస్తారని తెలియజేశారు. నామినేషన్లను దాఖలు చేసేవరకు ఓటు నమోదుకు ధరఖాస్తు చేసే అవకాశం ఉందన్నారు. వచ్చిన వాటిని పరిశీలించి, జాబితాల్లో చేర్చడానికి పదిరోజుల సమయం పడుతుంది కాబట్టి, ధరఖాస్తు చేయడానికి చివరితేదీ ఏప్రెల్ 14గా నిర్ణయించినట్లు తెలియజేశారు.