సమావేశంలో మాట్లాడుతున్న హిందూపురం మున్సిపల్ కమిషనర్
కొత్తచెరువు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని మండల స్పెషల్ ఆఫీసర్ శివ రంగ ప్రసాద్, తహశీల్దార్ రామాంజనేయ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అన్ని కుల సంఘాల నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బారాంసాహెబ్, ఏపీవో నాగిరెడ్డి, కుల సంఘాల నాయకులు ముద్దుల భాస్కర, అశోక్, రఫీ, మున్వర్బాషా తదితరులు పాల్గొన్నారు. బత్తలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనను పక్కాగా చేపట్టాలని ఎంపీపీ బగ్గిరి త్రివేణి, ఎంపీడీవో సాయిమనోహర్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ బగ్గిరి త్రివేణి అధ్యక్షతన కులగణన సర్వేపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, గ్రామ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో డిసెంబర్ 9 నుంచి 19 వరకు కుల గణన సర్వే ప్రారంభమవుతుందని, వంద శాతం గృహాలను కవర్ చేయాలని ఆదేశించారు. కులగణన సర్వేలో సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు భాగస్వాములు కావాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఓబుల దేవర చెరువు : కులగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి రమేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ తుమ్మల పర్వీన్ షామీర్ అధ్యక్షతన కుల గణన సర్వే సంబంధించిన సమావేశాన్ని అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ పది రోజుల్లోగా కుల గణన సర్వేను క్షేత్రస్థాయిలో చేపట్టి అధికారులు పరిశీలించి నివేదికలను తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇఒఆర్డి రాజశేఖర్, ఎంఇఒ సురేష్ బాబుతోపాటు ఆయా శాఖల అధికారులు ,రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చిలమత్తూరు : కులగణనపై ఎంపిడిఒ నరేష్ క్రిష్ణ అధ్యక్షతన స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో కులసంఘాలు, ప్రజాప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నాగరాజు, ఇఒఆర్డి ఈశ్వరయ్య, కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. హిందూపురం : ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న కుల గణనను సచివాలయ సిబ్బంది వార్డు వాలంటీర్ల సహకారంతో పారదర్శకంగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ అన్నారు. బుధవారం పురపాలక సంఘ వ్యాప్తంగా సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వార్డు సెక్రేటరీలకు కుల గణనపై మున్సిపల్ కార్యలయంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మేన్ బలరామిరెడ్డి, కౌన్సిల్ ప్రతి పక్ష నేత రమేష్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఎసిపి, పలువురు కౌన్సిలర్లు హాజరయ్యారు.