తనకు వచ్చిన గోల్డ్మెడల్స్ చూపుతున్న విద్యార్తి
పుట్టపర్తి అర్బన్ :పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లి కి చెందిన మండ్లి శ్రీకాంత్ కుమార్ యాదవ్ అనే విద్యార్థి సిఎన్ఎలో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించి 9 గోల్డ్ మెడల్స్ పొంది అరుదైన గౌరవం పొందాడు. ఈ మేరకు శ్రీకాంత్కుమార్ యాదవ్ గురువారం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సి వి ఆనంద్ బోస్ చేతుల మీదుగా 9 గోల్డ్ మెడల్స్, ఒక ప్లాటినంతో పాటు నగదు బహుమతి పురస్కారాన్ని, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. 2023 పరీక్షలలో దేశంలోనే మొదటి ర్యాంక్ సాధించిన వారిలో శ్రీకాంత్ కూడా ఉన్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మండ్లి కేశవ, నాగేంద్రమ్మ దంపతులకు జన్మించిన శ్రీకాంత్ పుట్టపర్తి జిల్లాకే పేరు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆ విద్యార్థి మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ఆశలను మమ్ము చేయకుండా కష్టపడి చదివినందుకు గోల్డ్ మెడల్స్తో సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. కాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. విద్యార్థులను మరింత ప్రోత్సాహం అందించడానికి ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ విద్యార్థికి దక్కిన అరుదైన గౌరవాన్ని పలువురు స్వాగతిస్తూ అభినందించారు.