May 26,2024 08:48

కలగానే కనీస వేతనం..!

       హిందూపురం : రోజురోజుకూ నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు అద్దెలు పెరిగాయి. కానీ కార్మికుల వేతనాలు మాత్రం అలాగే ఉన్నాయి. 11 ఏళ్లు క్రితం నిర్ణయించిన వేతనాలతోనే ఇప్పటికీ కార్మికుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో కనీస వేతనాలకు సంబంధించిన ఏర్పాటు చేసిన సలహా మండలి సిఫార్సులను సైతం గత జగనన్న ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగక కష్టజీవులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. అప్పుల పాలై ఆకలి పస్తులతో అల్లాడి పోతున్నారు. ఐదేళ్లుగా పెరిగిన ధరలు, ఛార్జీల నడుమ అరకొర వేతనాలతో సంఘటిత, అసంఘటిత రంగ కార్మిక కుటుంబాలు కష్టాల కడలిలో జీవనం సాగిస్తున్నాయి. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం కలగా మారింది. దాదాపు 11 ఏళ్ల క్రితం 2013లో నిర్ణయించిన కనీస వేతనమే నేటికీ అధికారిక కనీస వేతనంగా కొనసాగుతోంది. దీంతో కష్టజీవులు శ్రమ దోపిడీకి, అన్యాయానికి గురవుతున్నారు. గడిచిన పది సంవత్సరాల్లో నిత్యావసర సరుకులు, సేవల ధరలు 200 నుంచి 300 శాతానికి మించి పెరిగినా కార్మికుల వేతనాలు మాత్రం 10శాతం కూడా పెరుగుదల కనిపించడం లేదు. కార్మికుల కనీస వేతనాలు నిర్ణయించాల్సిన ప్రభుత్వాలు ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించడమే అందుకు నిదర్శనం. 2013 తరువాత కనీస వేతన సవరణ జరగ్గా, 2018 నాటికి ఐదేళ్లు పూర్తి కావస్తుండడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వేతన సవరణపై కసరత్తు ప్రారంభించింది. పెరుగుతున్న ధరలు, జీవన ప్రమాణాల ఆధారంగా వేతన సవరణకు సంబంధించి నివేదికను సిద్ధం చేయాలని సలహా మండలిని ఆదేశించింది. అప్పటి వేతన సలహా మండలి ఛైర్మన్‌ రఘుపతుల రామ్మోహన్‌ రావు నేతత్వంలోని బందం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన నిర్వహించి కార్మికులు, కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా కనీస వేతనాన్ని రూ.21 వేలుగా నిర్ణయించాలని కార్మిక సంఘాలన్నీ డిమాండ్‌ చేశాయి. దీంతో పాటు కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, వారి డిమాండ్లను నమోదు చేసి సలహా సంఘం నివేదికను సిద్ధం చేసింది. సరిగ్గా అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో మొత్తం ప్రక్రియ అక్కడికే ఆగిపోయింది. దీంతో కార్మికుల కనీస వేతన కల కలగానే మిగిలింది.

కార్మిక సలహా మండలి సిద్ధం చేసి ఇచ్చిన నివేదికను 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. అమలు చేయకుండా కనీస వేతన సలహా మండలి నివేదికను బుట్టదాఖలు చేసింది. రాష్ట్రంలో కనీస వేతన సవరణ సలహా బోర్డు ఉందా.. లేదా.. అన్నంతగా ఈ బోర్డు నిద్రావస్థలో పడిపోయింది. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా కనీస వేతన సవరణ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. వేతన సవరణ తనకు సంబంధం లేని విషయమే అన్నట్లు ప్రభుత్వం వ్యవహరించింది.

4.50 లక్షల మంది ఎదురు చూపులు

            ఉమ్మడి అనంతపురం జిల్లాలో 4.50 లక్షల మంది సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీరంతా వ్యవసాయం, అనుబంధ రంగాలైన దాదాపు 48 రకాల షెడ్యూల్‌ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వాటితో పాటు అసంఘటిత కార్మికులు నిర్మాణ కార్మికులుగా, సున్నం, ఇటుక బట్టీల్లో, షాపింగ్‌ కాంప్లెక్సులు, దుకాణాలు, ప్రయివేటు కంపెనీల్లో, ఆస్పత్రుల్లో పనిచేస్తూ ఉన్నారు. ఎలాంటి చట్టపరమైన భద్రత, వేతన భరోసా లేని వీరికి అన్యాయం జరగకుండా, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించేందుకు వేతన సవరణ సలహా బోర్డు ఎప్పటి కప్పుడు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తుంటుంది. ఏడేళ్ల క్రితం మొదలైన వేతన సవరణ ప్రక్రియను ఈ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది.

నిద్రావస్థలో కార్మిక శాఖ

       కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్మికశాఖ నిద్రావస్థలో మునిగిపోయింది. కార్మికులకు కనీస వేతనం దక్కక శ్రమదోపిడీకి గురవుతున్నా కార్మిక శాఖ ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. కార్మి కుల తరపున వేతన సవరణ బోర్డుకు సమస్యను నివేదించడం గానీ, అధికారులపై ఒత్తిడి తేవడం గాని చేయడం లేదు. వేతన సవరణ బోర్డు నిర్లక్ష్యం, కార్మిక శాఖ నిస్తేజం జిల్లాలో 4.50 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పటికీ గతంలో నిర్ణయించిన రూ.14 వేలు అధికారిక కనీస వేతనంగా కొనసాగుతుండడంతో వీరికి శ్రమ ఫలితం దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే కనీస వేతన సవరణపై కష్టజీవుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. తక్షణం కనీస వేతనాన్ని రూ.21 వేలకు పెంచాల ని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

చట్టాన్ని అమలు చేసి కార్మికులను ఆదుకోవాలి

ఈఎస్‌ వెంకటేష్‌ సిఐటియు జిల్లా కార్యదర్శి.

          సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం సమగ్ర చట్టాన్ని వెంటనే అమలు చేసి కార్మికులను ఆదుకోవాలి. ఉమ్మడి జిల్లాలో సుమారు 4.50 లక్షలకు పైగా సంఘటిత, అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు అమలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందన్నారు. కార్మికులకు సమగ్ర చట్టం అనేది చాలా ముఖ్యం. అనేక ప్రభుత్వాలను సిఐటియుగా డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతున్నది. దీంతో కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వచ్చే ప్రభుత్వం సమగ్ర చట్టాన్ని అమలు చేయడంతో పాటు సంక్షేమ బోర్డును సైతం ఏర్పాటు ఆదుకోవాలన్నారు.

➡️