తాగునీటి సమస్యపై వినతి పత్రం ఇస్తున్న బలిజ కాలనీవాసులు
పుట్టపర్తి క్రైమ్ : మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి బలిజ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆ కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ అంజయ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీలో దాదాపు వంద కుటుంబాలు ఉన్నాయన్నారు. నెల రోజులుగా కాలనీకి సక్రమంగా తాగునీరు సరఫరా చేయడం లేదని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. వారానికి ఓ సారి మాత్రమే నీరు వదులుతున్నారని, ఈ విషయంపై వాటర్ మెన్ను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. మా కాలనీకి గేట్ వాల్ ఏర్పాటు చేసి సక్రమంగా నీరు సరఫరా చేయాలని కమిషనర్ను కోరామన్నారు. స్పందించిన కమిషనర్ తగిన చర్యలు తీసుకుని బలిజ కాలనీకి సక్రమంగా నీరు సరఫరా చేయిస్తామని హామీ ఇచ్చాడన్నారు. కార్యక్రమంలో ఆ కాలనీ మహిళలు పాల్గొన్నారు.