అధికార పార్టీ వారికే ఇళ్ల స్థలాలు

జగనన్న కాలనీలో పేదలకు కాకుండా అధికార పార్టీ నాయకులు, వారి కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరులకు ఇళ్ల స్థలాలను కట్టబెట్టారని టెక్కలి ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
  • పేదలకు ఇచ్చిన చోట బలవంతంగా లాక్కొంటున్నారు
  • సమగ్ర దర్యాప్తు చేయాలి
  • కలెక్టర్‌కు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు లేఖ

ప్రజాశక్తి – కోటబొమ్మాళి

జగనన్న కాలనీలో పేదలకు కాకుండా అధికార పార్టీ నాయకులు, వారి కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరులకు ఇళ్ల స్థలాలను కట్టబెట్టారని టెక్కలి ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పేదలకు ఇచ్చిన చోట్ల వారి నుంచి అధికార పార్టీ నాయకులు, అనుచరులు బలవంతంగా లాక్కొని ఎక్కువ మొత్తానికి అమ్ముకుంటున్నారని తెలిపారు. ఈమేరకు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌కు లేఖ రాశారు. టెక్కలి మండలం జగతిమెట్ట దగ్గర జగనన్న కాలనీ, కోటబొమ్మాళి మండలం కొత్తపేట, కోటబొమ్మాళి, చీపుర్లపాడు గ్రామ పంచాయతీల్లో పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలను సర్పంచ్‌ల కుటుంబసభ్యులు, బంధువులు, వారి అనుచరులు, వైసిపి నాయకులకు మంజూరు చేశారని లేఖలో పేర్కొన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులు, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్థలాల ఆక్రమణలు, అనధికార విక్రయాలను ఆపాలని విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం స్పందించకుంటే రాబోయే టిడిపి ప్రభుత్వం వీటిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

➡️