సమావేశంలో మాట్లాడుతున్న విద్యాసాగర్
ప్రజాశక్తి- ఆమదాలవలస
నియోజకవర్గ అభివృద్ధిపై వైసిపి యువజన నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ సిద్ధమా అని రాష్ట్ర టిడిపి న్యాయ విభాగం కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్ ప్రశ్నించారు. గురువారం పట్టణంలో టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కూన రవికుమార్పై చేసిన ఆరోపణలపై ధ్వజమెత్తారు. క్రమశిక్షణకు, పరిపాలన దక్షతకు మారుపేరైన చంద్రబాబును విమర్శించే స్థాయి పిల్ల నాయకుడుకు లేదన్నారు. పట్టణంలో నిర్వహించిన లోకేష్ శంఖారావం కార్యక్రమంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. నియోజకవర్గంలో రవికుమార్ ఎటువంటి అభివృద్ధి చేయలేదని తన తండ్రి సీతారాం అభివృద్ధి చేశాడంటూ ప్రగల్బాలు పలకడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రవికుమార్ చొరవతో పొందూరు మండలంలో రహదారుల అభివృద్ధికి రూ.44 కోట్లు మంజూరు చేస్తే ఆ రహదారులపై నేడు నిర్వాహణ పనులు చేస్తూ వైసిపి ప్రభుత్వం రోడ్లు వేసిందని, చేస్తున్న అబద్ధపు ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు. మున్సిపాలిటీలో రవికుమార్ హయాంలో టిడిపి ఆధ్వర్యంలో రూ.242 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని వైసిపి హయాంలో ఎంత ఖర్చు చేసారో చెప్పగలరా అని ప్రశ్నించారు. సమావేశంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు నూక రాజు, జిల్లా కార్యాలయ కార్యదర్శి మొదలవలస రమేష్, రాష్ట్ర టిడిపి బిసి సెల్ కార్యదర్శి బోర గోవిందరావు పాల్గొన్నారు.