శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
అరసవల్లి ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, రానున్న కాలంలో ఆలయ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రూ.నాలుగు కోట్లతో చేపట్టనున్న ఇంద్రపుష్కరిణి పున: నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రపుష్కరిణిలో నిరంతరం స్వచ్ఛమైన నీరు ఉంచాలనే ఉద్దేశంతో నిర్మాణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. జూలై లోగా పనులు పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే రహదారుల అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రఘువర్మ, నర్తు రామారావు, దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ఇఒ హరి సూర్యప్రకాష్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.