ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యాన జిల్లాస్థాయి చెకుముకి సైన్సు సంబరాలను నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో మండల స్థాయిలో ఎంపికైన 65 టీమ్లకు చెందిన 195 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చెకుముకి పోటీల్లో విజేతలుగా ప్రభుత్వ పాఠశాలల విభాగం నుంచి శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు ప్రథమ స్థానం, జలుమూరు మండలం పెద్ద దూగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానం, కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నరసన్నపేట మహాత్మా జ్యోతిబాపూలే బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తృతీయ, జి.సిగడాం ఎపి మోడల్ స్కూల్ నాలుగో స్థానం దక్కించుకున్నాయి. ప్రైవేటు పాఠశాలల విభాగం నుంచి నగరంలోని గీతాంజలి స్కూల్ ప్రథమ, రణస్థలం ఆర్డర్ స్కూల్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఉప విద్యాశాఖ అధికారి జి.పగడాలమ్మ, జిల్లా సైన్స్ అధికారి ఎన్.కుమారస్వామి, పూర్వ ఉప విద్యాశాఖ అధికారి కొత్తకోట అప్పారావులు పోటీలను పర్యవేక్షించారు. అనంతరం జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కుప్పిలి కామేశ్వరరావు, ఎపిపిఎస్టిఎఫ్ గౌరవాధ్యక్షులు ఎస్.ఎస్ శ్రీనివాస్ శర్మ, జెవివి రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్తో కలిసి వారు విజేతలకు బహుమతులు అందజేశారు.