మెళియాపుట్టి : ధాన్యం రాశులను పరిశీలిస్తున్న తహశీల్దార్ సరోజిని
ప్రజాశక్తి- రణస్థలం
ఈ నెల 3, 4, 5 తేదీల్లో తుపాను కారణంగా భారీవర్ష సూచన ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ సనపల కిరణ్ కుమార్ కోరారు. పూరిళ్లు, మట్టి ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, రైతులు వరికుప్పలు, ధాన్యం జాగ్రత్త పర్చుకోవాలని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా స్థానిక సచివాలయం లేదా తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. గ్రామాల్లో విఆర్ఒలు అందుబాటులో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు మండల అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పోలాకి: ప్రజలు తుఫాన్ ప్రభావానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ కె.శ్రీరాములు తెలిపారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తహశీల్దార్ కార్యక్రమంలో 2 నుంచి 5 వరకు ప్రత్యేక టీంలతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నాలుగు రోజులు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెల్లవద్దని, ఈదురు గాలులు వీస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏవైనా సంఘటనలు జరిగితే వెంటనే సంబంధిత విఆర్ఒలకు సమాచారం అందించాలన్నారు. అలాగే తహశీల్దార్ కార్యాలయంలో టోల్ఫ్రీ నెంబర్ 9440731373 నెంబర్కు తెలియచేయాలని కోరారు. సమావేశంలో డిటి శ్రీనివాసరావు, కోటీశ్వరరావు, ఆర్ఐ సతీష్, విఆర్ఒలు పాల్గొన్నారు.మెళియాపుట్టి: మిచౌంగ్ తుఫాను సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం రైతులు కోతను వాయిదా వేసుకోవాలని తహశీల్దార్ పి.సరోజిని సూచించారు. 3,4,5 తేదీల్లో అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేశారు. అలాగే వరి కోతల కోసినా వరి పనలు జాగ్రత్తగా కుప్పలు కట్టి టార్పాలిన్లు కప్పుకోవాలన్నారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని సురక్షితమైన, ఎత్తైన ప్రదేశాల్లో నిల్వచేసి టార్పాలిన్లు కప్పుకోవాలని రైతులకు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టుపురం, శేఖరాపురం రైతులకళ్లాల వద్ద నూర్పుడి చేసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి దాన కర్ణుడు, వ్యవసాయ సహాయకులు శరత్ కుమార్ రెడ్డి, జయలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.