నిరసన తెలుపుతున్న న్యాయవాదులు
ప్రజాశక్తి- ఇచ్ఛాపురం
ల్యాండ్ టైట్లింగ్ యాక్డు-23 రద్దు కోరుతూ స్థానిక ఐఎఎల్ యూనిట్, ఇఛ్ఛాపురం న్యాయవాదుల సంఘం సంయుక్తంగా గురువారం నిరసన తెలిపారు. ఐఎఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజ్ పాత్రో సమన్వయంతో స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట ప్లకార్డులు చేతబట్టి నిరసన చేపట్టారు. అక్కడ నుంచి పాత బస్టాండ్ కూడలి వరకు నడుచుకుని వెళ్లి అక్కడ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు న్యాయం చేయడానికి నిరంతరం పనిచేస్తున్న న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. సామాన్యులు, బడుగు, బలహీనుల హక్కులు కాలరాసే విధంగా న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం జిఒ నంబరు 512ను తీసుకొచ్చిందన్నారు. న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజల హక్కులు నిర్ధారించే అవకాశాలు ఉన్నప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. రెవెన్యూ అధికారులకు అటువంటి బాధ్యతలు బదలాయిస్తే… ప్రజలకు తీవ్రమైన నష్టం తప్పదని అన్నారు. ఎవరి భూములు ఏమైపోతాయో, సన్న, చిన్నకారు రైతులు ఎలాంటి తిప్పలు పడి భూములు కోల్పోవాల్సి వస్తుందో ఆలోచన చేయాలని సూచించారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు మండల న్యాయస్థానాలు ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.దేవరాజు, ఎన్.సి.సాహు, న్యాయవాదులు ఎస్.ఎల్.నారాయణ, ఎన్.రమణయ్య, దక్కత కృష్ణమూర్తి, గిన్ని సీతయ్య, ఎన్.వి.ఎస్.రంగారావు, భగవాన్దాస్, ప్రహ్లద్, ఎం.కె.సామంత్, బి.సూర్యనారాయణ పాల్గొన్నారు.