స్పీకర్కు శిథిలావస్థ పాఠశాల భవనాన్ని చూపిస్తున్న గ్రామస్తులు
- స్పీకర్కు రావివలస గ్రామస్తుల వినతి
ప్రజాశక్తి- సరుబుజ్జిలి
మండలంలోని రావివలసలో గల ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని, నూతన భవనానికి నిధులు మంజూరు చేసి విద్యార్థులను ఆదుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు రావివలస గ్రామస్తులు విన్నవించారు. గురువారం పాలవలస గ్రామ సచివాలయ పరిధిలో రావివలస, రావివలస కాలనీ, చిన్న వెంకటాపురం గ్రామాల్లో సర్పంచ్ వండాన కృష్ణ ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల వద్దకు స్పీకర్ రాగానే పాఠశాల పిఎంసి చైర్మన్ అదపాక చంద్రశేఖరరావు, సర్పంచ్ కృష్ణ స్పీకర్కు పాఠశాలను, పాఠశాల లోపల భాగం, వంటశాల చూపించారు. భవనాలు శిధిలావస్థకు చేరుకున్నాయని శ్లాబ్ నుంచి పెచ్చులు ఊడి పడుతున్నాయని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో నాడు-నేడు రెండో విడతలో పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారని, నేటివరకు కార్యరూపం దాల్చలేదని వివరించారు. నిధులు మంజూరు చేసి నూతన భవనాల నిర్మాణం చేపట్టాలని కోరారు. నూతన పాఠశాల భవన నిర్మాణానికి కృషి చేస్తానని స్పీకర్ వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి కెవిజి సత్యనారాయణ, జెడ్పిటిసి సురవరపు నాగేశ్వరరావు, వైస్ ఎంపిపి శివానందమూర్తి బాబు, ఎంపిడిఒ పివిపి మురళీమోహన్ కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.