గీతాంజలి స్కూల్లో పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
24,500 మంది దరఖాస్తు
3,946 మంది గైర్హాజరు
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి
జిల్లాలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 82 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్షలకు 24,500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 20,554 మంది (83.89 శాతం) రాశారు. పరీక్షకు 3,946 మంది గైర్హజరయ్యారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక అఫీషియల్ కాలనీలో గల గీతాంజలి స్కూల్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సందర్శించారు. పరీక్షలు జరగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రూట్ ఆఫీసర్ జిల్లా ఉద్యాన అధికారి ఆర్.వి.విప్రసాద్, లైజన్ ఆఫీసర్ పి.ఉమామహేశ్వరరావు, సూపరింటెండెంట్ కృష్ణవేణి పాల్గొన్నారు. ఎచ్చెర్లలోని శ్రీవెంకటేశ్వర ఫార్మసీ, పాలిటెక్నిక్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జెసి ఎం.నవీన్ పరిశీలించారు. అభ్యర్ధుల సంతకాల రిజిస్టర్ను, రోల్ నంబర్ కనుగుణంగా సీటింగ్ ఏర్పాట్లను చూశారు. పరీక్ష సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే టెక్కలిలోని అన్ని పరీక్షా కేంద్రాలను సబ్ కలెక్టర్ నూరల్ కమర్ పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో నిర్వహించిన పరీక్షా కేంద్రాన్ని డిప్యూటీ సిఇఒ వెంకట్రామన్ పరిశీలించారు. పలాసలోని ఆర్డిఒ భరత్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, కాశీబుగ్గ డిఎస్పి నాగేశ్వరరెడ్డి పర్యవేక్షించారు. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పిగ్రూప్-2 పరీక్ష నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఎస్పి జి.ఆర్.రాధిక స్వయంగా పరిశీలించారు. పరీక్షా కంద్రాల ఆవరణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. అభ్యర్థులు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకువెళ్లకుండా సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని తెలిపారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లను మూయించామని చెప్పారు.