ముగ్గుల పోటీలను పరిశీలిస్తున్న న్యాయ నిర్ణేతలు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా మహిళలు పెద్దఎత్తున భాగస్వాములయ్యేందుకు వీలుగా స్వీప్ ఆధ్వర్యాన నగరంలోని పురపాలక ఉన్నత పాఠశాల మైదానంలో మహిళలకు ముగ్గులు, వంటల పోటీలను బుధవారం నిర్వహించారు. ఈ పోటీలు ఆకట్టుకపోవడంతో పాటు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాయి. నగరపాలక సంస్థ కమిషనర్ తమీమ్ అన్సారియా, డిఆర్డిఎ పీడీ ఎం.కిరణ్కుమార్, బిసి కార్పొరేషన్ ఇడి గడ్డెమ్మ పోటీలను పర్యవేక్షించారు. న్యాయ నిర్ణేతలుగా జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.సుధ, వికలాంగుల శాఖ ఎడి కవిత, ప్రోగ్రాం కోఆర్డినేటరు భాగ్యలక్ష్మి, కెవికె డైరెక్టర్ ప్రసన్నకుమారి వ్యవహరించారు. ముగ్గుల పోటీల్లో కె.రత్నంకు ప్రథమ, ఎం.శ్రీలక్ష్మికి ద్వితీయ, ఎం.రేవతికి తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. వంటల పోటీల్లో ఎల్.పద్మ, టి.గౌరీ, కె.కవిత ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు.