మాట్లాడుతున్న గొండు శంకర్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజక వర్గం నుంచి పోటీ చేసిన తనకు సాయపడ్డ వారందరికి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో నియోజక వర్గ పార్టీ నాయకులతో ఆదివారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. నగర టిడిపి అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగా తాను ఒంటరిని కాదని, కార్యకర్తలు, అభిమానుల అండ దండలతోనే ఎన్నికల్లో నిలిచానని, అడుగడుగున వెన్నంటే ఉండి తనకు సహకరించిన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటానన్నారు. ఓటింగ్ ప్రక్రియలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనేలా చైతన్యం చేయడంలో వార్డు ఇన్ఛార్జులు కృషి చేశారన్నారు. వారి కృషి ఫలితంగా టిడిపి, జనసేన, బిజెపి కూటమి బలపడిందన్నారు. రెండు నెలల పాటు నాయకులు, నగరంలోని డివిజన్ ఇన్ఛార్జులు, కార్యకర్తల అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించే వారు అప్రమతంగా ఉండాలని శంకర్ సూచించారు. సమా వేశంలో పార్టీ నాయకులు రెడ్డి గిరిజా శంకర్, చల్లా వాసు, పిఎంజెబాబు, రెడ్డి శివన్నాయుడు, కొర్ను నాగార్జున, సూరిబాబు, సర్సింహమూర్తి, సింతు సుధాకర్, కోరాడ హరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.