బొబ్బిలిపేటలో ఫ్లాగ్మార్చ్ నిర్వహిస్తున్న పోలీసులు
ప్రజాశక్తి- ఆమదాలవలస
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిఒక్కరు నిర్భయంగా ఓటుహక్కును వినియోగించు కోవాలని ఎస్ఐ కె.వెంకటేష్ అన్నారు. శనివారం మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన కనుగులవలస, బొబ్బిలిపేటలో కేంద్ర భద్రతా బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత ఎన్నికలు నిర్వహించడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి వివాదాలకు వెళ్లకూడదన్నారు. ముఖ్యంగా యువత రాజకీయ పార్టీలకు వత్తాసు పలుకుతూ వాదనలకు దిగి వివాదాలను కొని తెచ్చుకోవడం వలన పోలీస్ కేసుల్లో ఇరుక్కొని తమ ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో కేంద్ర భద్రతా బలగాలు, గ్రామస్తులు పాల్గొన్నారు