ప్రజాశక్తి-మెరక ముడిదాం : మండలంలోని గర్భాం గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి కీర్తి శేషులు తాడ్డి కృష్ణారావు కుమారుడు తాడ్డి చంద్రశేఖర్, చీపురుపల్లి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు ఆధ్వర్యంలో గురువారం టిడిపిలో చేరారు. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశంలో చేరాయి. ఈ సందర్భంగా కళా వెంకటరావు మాట్లాడుతూ సముద్రం ఉప్పొంగి పోయేలా వచ్చిన జనాన్ని చూస్తే రాష్ట్రంలో వైసిపి మట్టి కరవడం ఖాయమని అనిపిస్తుందని అన్నారు. వైసిపి నాయకులను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయించడం తప్ప మంచి ఏమీ జరగ లేదని తెలిపారు. మద్యం ద్వారా లక్ష ముప్పై వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ధరలు ఆకాశాన్ని అంటాయని, దోచుకోవడం, గుద్దులు గుద్దడం తప్పించి చేసేదేమీ లేదన్నారు. ఇలాంటి దుష్ట పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోనికి వస్తే ఇరువై లక్షల ఉద్యోగాలు, మహిళలకు ప్రత్యేక నిధులు కేటాయించడం, ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు. మంచి సుపరి పాలన కావాలంటే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి కావాలని, మెరక ముడిదాం నుండి అత్యధిక మెజారిటీతో టిడిపి అభ్యర్థిని అయిన నన్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమం లో మండల టిడిపి అధ్యక్షులు తాడ్డి సన్యాసినాయుడు, కోట్ల మోతిలాల్ నాయుడు, కె. త్రిమూర్తులురాజు, కిమిడి మల్లిక్ నాయుడు, రౌతు రమేష్ నాయుడు, కోట్ల సుగుణాకరరావు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి కెంగువ ధనంజయ, భైరిపురం మాజీ ఎంపిటిసి మంత్రి సీతం నాయుడు, జనసేన, బి జెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.