బైక్‌ని ఢీకొన్న కారు.. యువకుడు మృతి

  • ఇద్దరి పరిస్థితి విషమం
  • బొల్లాపల్లి టోల్‌ ప్లాజా వద్ద ఘటన

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల) : బొల్లాపల్లి టోల్‌ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయరహదారిపై అతివేగంగా వెళుతున్న కారు ముందు వెళుతున్న బైక్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మతి చెందాడు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఓళ్ళు గగుర్పొడిచేలా జరిగిన ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగంలో బైక్‌ ఇరుక్కుపోయి కొద్దీ దూరం ఈడ్చుకు పోయింది. మార్టూరు అర్బన్‌ సీఐ ఎస్వీ రాజశేఖరరెడ్డి కధనం ప్రకారం.. జె పంగులూరు మండలం రాంకురు గ్రామానికి చెందిన షేక్‌ నాగూర్‌ వలి (26),షేక్‌ నసీర్‌, తలపల హరీష్‌ ముగ్గురు స్నేహితులు.. వీరంతా గురువారం ఒకే బైక్‌ పై టోల్‌ ప్లాజా నుండి మార్టూరు వైపు వెళుతున్నారు. అదే సమయంలో ఒంగోలు వైపు నుండి గుంటూరు వెళుతున్న కారు వీరి బైక్‌ని అతివేగంగా వెనుక నుండి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురు యువకులు ఎగిరి రోడ్డుపై పడిపోయారు. వీరిలో నాగూర్‌ వలి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నసీర్‌, హరీష్‌లను హైవే అంబులెన్సులో ముందుగా మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో గుంటూరు సర్వజన సమగ్ర వైద్యశాలకు తరలించారు. నాగూర్‌ వలి మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ మహమ్మద్‌ బాషా తెలిపారు.

➡️