నిరంతర నిఘా ఉండాలి : కలెక్టర్‌

Apr 13,2024 21:05

ప్రజాశక్తి – పాచిపెంట : సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతర పటిష్ట నిఘా ఉండాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని పద్మాపురం, పి.కోనవలస చెక్‌ పోస్ట్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. చెక్‌ పోస్టుల వద్ద కేసుల నమోదు, నగదు, వాహనాలు సీజ్‌ చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్రమ మద్యం, నగదు తరలించకుండా 24గంటలు నిరంతర పటిష్ట నిఘాను పెట్టాలని సూచించారు. చెక్‌ పోస్ట్‌ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా చెక్‌ పోస్ట్‌ తనిఖీలను కంట్రోల్‌ రూమ్‌ నుంచి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. చెక్‌ పోస్టుల నుంచి సిసి కెమెరాల పని తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ విధమైన ఉదాసీనతను ప్రదర్శించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమతో పాటు తీసుకువెళ్లే నగదు, బంగారం, ఆభరణాలు వంటి వాటికి విధిగా ఆధారాలు ఉండాలనిస్పష్టం చేశారు. మద్యం, మాదక ద్రవ్యాలు రవాణాపై గట్టి నిఘా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఎంపిడిఒ లక్ష్మీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️