ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని 4,5 డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభోత్సవాలు చేశారు. ఆదివారం బాబా మెట్టలోని ద్వారకా నగర్ లోనూ, కొత్తపేట లోని విజయలక్ష్మి నగర్ లోనూ నూతనంగా ఏర్పాటు చేసిన రహదారులను ప్రారంభించి ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లకు కార్పొరేటర్లు గాదం మురళి, మారోజు శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు గదుల సత్యలత, వీర్రాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నగర అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా బాబా మెట్ట ప్రాంతంలో 4 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. మరోసారి ఆయనను శాసనసభ్యునిగా గెలిపించినట్లయితే తమ డివిజన్లు సమస్యలు లేని ప్రాంతాలుగా తీర్చిదిద్దుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. ఇప్పటికే నగర అందాలను ఎంతగానో తీర్చిదిద్దారని అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే స్థానిక సమస్యల పైన ఆరా తీసి పరిష్కరించేందుకు చొరవ చూపారని, ఇదంతా నగర ప్రజల అదృష్టమని అన్నారు. ఈరోజు 69 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, ఫ్లోర్ లీడర్ ఎస్ వి వి రాజేష్, కేఏపీ రాజు తదితరులు పాల్గొన్నారు.