ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : మిమ్స్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద సిఐటియు ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు మాట్లాడుతూ నెల్లిమర్ల మిమ్స్ హాస్పిటల్ పనిచేస్తున్న ఉద్యోగులు 62 రోజులుగా వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్నా యాజ మాన్యంలో చలనం లేదని, ప్రభుత్వానికి ఏమాత్రమూ పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులను, మహిళలను అరెస్టు చేయడం దారుణమన్నారు. 20 సంవత్సరాలుగా కష్టపడి పనిచేసి మిమ్స్ సంస్థ అభివృద్ధికి దోహదం చేసిన ఉద్యోగులను రోడ్డున పడేయడం అన్యాయమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, వేతన ఒప్పందం చేయాలని, సస్పెండ్లు, వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన డిఎను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి గొర్రెల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/ppmt-citu.jpg)