తిరుపతి లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ప్రజాశక్తి-తిరుపతి టౌన్:తిరుపతి నగరంలో ఏకధాటిగా కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను నగరపాలక సంస్థ కమిషనర్ హరిత పరిశీలించారు. ముఖ్యంగా కొరమీనుగుంట, కరకంబాడీ రోడ్డు, బస్టాండ్ ప్రాంతాలు, పార్వతీపు, లక్ష్మీపురం సర్కిల్ ప్రాంతాలు, ఎస్పిడిసియల్ పక్కనున్న లోతట్టు ప్రాంతాలను, కుంటలు కలిగిన ప్రాంతాలను పరిశీలించారు. తుపాను దృష్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఇప్పటికే గుర్తించిన పది లోతట్టు ప్రాంతాల్లో నీరు వీధుల్లోకి, కొన్ని ఇండ్లలోకి రావడాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన కమిషనర్, ఆ ప్రాంతాల ప్రజలను దగ్గర్లోని పునరావాస కేంద్రాలకు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు తరలించి వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను, ఆహార పదార్థాలను అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాలువల్లోని వ్యర్ధాలను, రహదారులపై పడుతున్న చెట్టు కొమ్మలను, చెత్త దిబ్బలను ఎప్పటికప్పుడు తొలగించాలని, అవసరమైన పక్షంలో చెత్తను తరలించేందుకు మరిన్ని వాహనాలను తెప్పించేందుకు సిద్దంగా ఉండాలన్నారు. డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్లు, అర్భన్ ఎమ్మార్వో వెంకటరమణ, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎస్ఈ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీఈలు, ఇంజనీరింగ్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
![తిరుపతి లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్](https://prajasakti.com/wp-content/uploads/2023/12/55555555555555555.jpg)