నా రెండో సంతకం ల్యాండ్యాక్టుపైనే..!చిత్తూరు సభలో చంద్రబాబుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ‘ప్రజలు మళ్లీ మోసపోయి జగన్కు ఓటేస్తే, కర్మకాలి అధికారంలోకి వస్తే మీతాత ముత్తాతలు సంపాదించిన భూమి ఉండదని, కూటమి అధికారంలోకి రాగానే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టును రద్దు చేస్తా’ అని నారా చంద్రబాబునాయుడు అన్నారు. ‘ల్యాండ్ చట్టం తెచ్చి, మీ మెడలకు ఉరి వేశారని, రేపు జరగనున్న సంగ్రామంలో ఫ్యానుకు ఉరివేయాలి’ అన్నారు. రేపు జరగనున్న ఎన్నికల్లో ఆది, సోమవారాల్లో తాను ఎక్కడికీ పోవడం లేదని, కంట్రోల్ రూమ్లో కూర్చుని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళిని, వైసిపి ఆగడాలను చూస్తుంటానని, ధైర్యంగా ప్రజలు ఓటేసి కూటమిని గెలిపించాలని కోరారు. ‘ఈ ఊరు మనదిరా.. ఈ భూమి మనదిరా.. మన పట్టా బుక్లో జగన్ ఫొటో ఏంటిరా’ అని కూటమి పాటను వినిపించారు. ఎవరి ఫొటోలు లేకుండా రాజముద్రతోనే తాను పట్టాపాసుపుస్తకం ఇస్తానన్నారు. తాను మెగా డిఎస్సి తొలిసంతకం. ల్యాండ్ టైటిల్ యాక్టు రెండో సంతకం చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు చిత్తూరు మురకంబట్టు జంక్షన్ వద్ద సాయంత్రం 5.50గంటలకు ప్రచారాన్ని ముగించారు. ముగించే ముందు జోరుగా వర్షం పడడంతో కూటమి అధికారంలోకి వస్తుందనడానికి వరుణదేవుడే సాక్షి అని అన్నారు. వర్షంలో తడుస్తూనే కొద్దిసేపు ప్రసంగించాడు. 2024-29లో ఈ రాష్ట్రం అభివృద్ధి పరుగులు తీయడానికి తాను, జనసేన అధినేత పవన్కల్యాణ్ ఒక విజినరీ తయారు చేశామని, ఐదేళ్లలో ఈ విజిలరీ అద్భుత ఫలితాలు ఇవ్వనుందన్నారు. అమరావతే రాజధానిగా కొనసాగుతుందని, పోలవరం రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. పోలవరం పూర్తికి కేంద్రంలోని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తామన్నారు. కుప్పలు తెప్పలుగా పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తామన్నారు. సూపర్సిక్స్ పథకాలు, మోడీ గ్యారంటీ, ప్రజాగళం హామీలను ఉద్ఘాటించారు. తెలుగుజాతిని ప్రపంచవ్యాప్తంగా నంబర్వన్ స్థానంలో తీసుకొస్తామన్నారు. 2029కల్లా అసెంబ్లీలో 33 శాతం మహిళలు ప్రవేశించే దిశగా చట్టం తెస్తామన్నారు. ప్రతి ఏటా జాబ్క్యాలెండర్, బిసి డిక్లరేషన్ తీసుకొస్తూ, వారి శ్రేయస్సుకు లక్షా 50వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి జగన్ ఏం చేశాడన్నారు. జగన్ను నమ్మొద్దన్నారు. ఈ బహిరంగసభలో చిత్తూరు, పూతలపట్టు ఎంఎల్ఎ అభ్యర్థులు గురజాల జగన్మోహన్రావు, డాక్టర్ కె.మురళి మోహన్, టిడిపి ఎంపి అభ్యర్ధి దుగ్గుమళ్ల ప్రసాద్రావు, మాజీ ఎంఎల్సి దొరబాబు, జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ పాల్గొన్నారు.