ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ :
ఎయు విసి పివిజిడి.ప్రసాద్రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల చిత్రపటాలను తన ఛాంబర్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఎయు పరిరక్షణ సమితి, టిఎన్ఎస్ఎఫ్, జనసేన విద్యార్థి విభాగం, దళిత విద్యార్థి విభాగం, పలు యువజన సంఘాల ఆధ్వర్యాన గురువారం మధ్యాహ్నం ఎయు విసి ఛాంబర్ ఎదుట బైఠాయించారు. వైసిపి నాయకునిగా వ్యవహరించిన విసి ప్రసాద రెడ్డి ప్రభుత్వం ఆదేశించినా ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల చిత్రపటాలను తన ఛాంబర్లో పెట్టలేదన్నారు. ఆయన అక్రమాల మీద విచారణ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారికి సర్దిచెప్పారు కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, జనసేన విద్యార్థి, యువజన సంఘాల నాయకుడు మర్రివేముల శ్రీనివాస్, డాక్టర్ పొన్నాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.