స్పీకర్‌ స్థానానికి గౌరవం పెరిగేలా పని చేస్తా : అయ్యన్న

Jun 30,2024 00:54 #ayyanna patrudu, #spekar
అయ్యన్నకు స్వాగతం పలుకుతున్న నగర ప్రముఖులు

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ :

స్పీకర్‌ స్థానానికి మరింత గౌరవం పెరిగేలా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అతి చిన్న వయసులో ఎన్‌టిఆర్‌ మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబు స్పీకర్‌ పదవి ద్వారా అత్యున్నత గౌరవం ఇచ్చి ప్రధాన బాధ్యతలు అప్పగించారని అన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పరిమితులకు లోబడి హుందాగా పని చేస్తానని పేర్కొన్నారు. స్పీకర్‌గా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన శనివారం తొలిసారిగా విశాఖపట్నానికి విచ్చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ పైమేరకు స్పందించారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌, పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, ఎస్‌పి మరళీకృష్ణ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఆర్‌డిఒ హుస్సేన్‌ సాహెబ్‌, పోలీసు అధికారులు విశాల్‌ గున్ని, మేకా సత్తిబాబు, స్థానిక నేతలు, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన నేతలు, అధికారులు స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 

➡️