మాజీ ఎంఎల్ఎ, తణుకు టిడిపి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ
ప్రజాశక్తి – తణుకురూరల్
టిడిపి కూటమి మేనిఫెస్టోకు విశేష స్పందన లభిస్తోందని మాజీ ఎంఎల్ఎ, టిడిపి తణుకు అభ్యర్ధి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం తణుకు పట్టణం 12వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లి కూటమికి మద్దతివ్వాలని అభ్యర్థించారు. పట్టణంలో చక్కని స్పందన లభిస్తుందన్నారు. తణుకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి తాను ఎంఎల్ఎగా ఉన్న 2014-19 మధ్యలోనే జరిగిందని, ఆ తర్వాత ప్రగతి అనేది ఎక్కడికక్కడ స్తంభించిందని ప్రజలే స్పష్టంగా చెబుతున్నారన్నారు. గత ఐదేళ్లలో అభివృద్ధి అడ్రస్ లేదని, అవినీతి, అరాచకం మాత్రమే కనిపిస్తున్నాయని వాపోతున్నారన్నారు. బిసిలకు రక్షణ చట్టం తేవడంతోపాటు 50 సంవత్సరాలకే పెన్షన్ కల్పించడం గొప్ప పరిణామమన్నారు. పింఛన్ సొమ్మును రూ.4 వేలకు పెంచడంతోపాటు ప్రతి ఇంటికీ పంపిస్తారన్నారు. పింఛన్ల పంపిణీలో వైసిపి దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ కచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఎస్సి, ఎస్టి సబ్ప్లాన్ సమర్థవంతంగా అమలు చేస్తామని, మైనార్టీ సోదరులకు సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు. అనంతరం రోడ్డుషో నిర్వహిస్తూ తణుకు మండలం ముద్దాపురం, కోనాల గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి బట్టవల్లి నాగరాజు, లక్ష్మీ, పెండింటి దుర్గారావు, ఆదిలక్ష్మీ, ఉమ్మడి వెంకటేశ్వరరావు, తామరపు సత్యనారాయణ, బూరుగుపల్లి రమేష్, వల్లభనేని వీరాస్వామి, ముళ్ళపూడి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.