ప్రజాశక్తి – ఆచంట
వైసిపి అరాచక పాలనను అంతమొందించాలని మాజీ మంత్రి, టిడిపి ఎంఎల్ఎ అభ్యర్థి పితాని సత్యనారాయణ అన్నారు. శనివారం పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్డిఎ ఛార్జ్జిషీట్ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా వెనక్కి నెట్టారన్నారు. రాష్ట్రంలో కబ్జాలు, దోపిడీలతో ప్రజలు నిత్యం భయంతో జీవించారన్నారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ సప్లై నిధులను లక్షల కోట్లు దారి మళ్లించి నవరత్నాలతో నవ మోసాలు చేశారని విమర్శించారు. బిజెపి పరిశీలికుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ల్యాండ్ మాఫియా, సేన మాఫియా, మైనింగ్ మాఫియా, గంజాయి, డ్రగ్స్ తదితర వాటిపై రూ.ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కొట్టేసిన జగన్పై ఎన్డిఎ ఛార్జిషీట్ వేయాలన్నారు. మాజీ ఎంఎల్సి మల్లుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీల సబ్ప్లాన్ నిధులను లక్ష కోట్లు దారి మళ్లించారని విమర్శించారు. జనసేన మండల అధ్యక్షులు బాలాజీ నాయుడు మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో జగన్ అవాస్తవాలను వాస్తవాలుగా తన మీడియా ద్వారా మాయ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ తెచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు.