ప్రజాశక్తి – కురుపాం : ఇండియా వేదిక బలపర్చిన సిపిఎం కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణను, అరకు పార్లమెంటు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనరసను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుబ్బారావమ్మ కోరారు. మండలంలోని నీలకంఠాపురం సంతలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావమ్మ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల కోసం ప్రత్యేక జిసిసి ఉన్నప్పటికీ వారు పండించిన పంటలకు కనీసం గిట్టుబాటు ధర లేకుండా ఉండడంతో ఆదివాసీల పంటలు దళారులపాలై ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. యువతకు ఉపాధి కరువై నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బిజెపి, పొత్తు తొత్తు పార్టీలను ఓడించి ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తేనే మన ఆదివాసీల మనుగుడ, అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం పంచాయతీ పరిధిలో గల మామిడిగూడ, జుంబిరి , చింతమాను గూడ, పొలం గూడా తదితర గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, నాయకులు కోరాడ ఈశ్వరరావు, కోలక అవినాష్, ఉలక వాసు, మండంగి అడ్డమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.సమస్యలు తెలుసుకుంటూ సంతలో ప్రచారం నిర్వహిస్తూ…సిపిఎం అభ్యర్థి మండంగి రమణ మండలంలోని నీలకంఠాపురంలో తన ఎన్నికల ప్రచారం వినూన్నత రీతిలో నిర్వహించారు. సంత వద్దకు వెళ్లి రోడ్డు పక్కన చిరు వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గ ప్రజలు చిరు వ్యాపారస్తులంతా బాగుండాలంటే ఇండియా కూటమితోనే సాధ్యమని అన్నారు. కావున రానున్న ఎన్నికల్లో సిపిఎంకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు.
గుమ్మలక్ష్మీపురం : సిపిఎం అభ్యర్థులను గెలిపించి గిరిజన హక్కులను కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోలక అవినాష్ కోరారు. కేదారిపురం, వంగర, నోండ్రుకోన పంచాయతీల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేశారు. సిపిఎం నాయకులు ఎం.సన్యాసిరావు, బి.రమేష్, బి.ఆడిత్తు, ఎం.నూకయ్య, పి.శ్రీరాములు, పి.ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.
గరుగుబిల్లి : మరుపెంట పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బివి రమణ, కె.రవీంద్ర మాట్లాడుతూ సిపిఎం అభ్యర్థులుగా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి మండంగి రమణ, అరకు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పి.అప్పలనర్సను గెలిపించాలని కోరారు.
సీతంపేట : మండలంలోని కుసుమూరు, టిటుకుపాయి, కొత్తకోటలో ప్రచారం చేశారు. సిపిఎం, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలనికోరారు. సిపిఎం మన్యం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం,తిరుపతిరావు, కాంగ్రెస్ అభ్యర్థి సవర చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈతమాను గూడా పంచాయతీలో గురండి, పుట్టిగాం గిరిజన గ్రామాల్లో శ్రీకాకుళం జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గంగరాపు సింహాచలం ప్రచారం చేశారు.
సాలూరురూరల్ : మండలంలోని జిల్లెడువలస పంచాయతీ పరిధిలోని బెల్లపాక, బొడ్డపాడులో ఇండియా కూటమి అభ్యర్థుల తరఫున గిరిజన సంఘం నాయకులు సీదరపు అప్పారావు, సిపిఎం మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు ప్రచారం నిర్వహించారు. సీదరపు మోహన్, గిమ్మేళ వెంకటేష్ పాల్గొన్నారు.