మహిళా పోలీసులతో ఎస్పీ మలిక గర్గ్
ప్రజాశక్తి – చిలకలూరిపేట : ప్రజల సమస్యలను పరిష్కరించడం ద్వారా పోలీసుల గౌరవాన్ని మరింతగా పెంచాలని సిబ్బందికి పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గర్గ్ సూచించారు. చిలకలూరిపేటలోని పట్టణ, రూరల్ పోలీస్స్టేషన్లను మంగళవారం సందర్శించిన ఎస్పీ పోలీస్ స్టేషన్ క్వార్టర్స్, సిబ్బంది సంక్షేమంపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో అరెస్టు చేయాల్సిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించామని, అరెస్టయిన వారిలో రౌడీషీట్లు ఓపెన్ చేయాలనే వారిపైనా ప్రతిపాదనలు పంపాలని చెప్పామని అన్నారు. మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని, గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ పోలీసుల గౌరవాన్ని పెంచాలని సూచించామన్నారు. పట్టణంలోని ప్రధానంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆదేశించామన్నారు. గంజాయి అమ్మినా, కొన్నా, తాగినా సహించబోమని హెచ్చరించారు. అనంతరం రూరల్ పోలీస్స్టేషన్లో 2004లో మావోయిస్టుల దాడిలో మరణించిన సిఐ ఆర్.ప్రసాదు, సిబ్బందికి నివాళులర్పించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/cpt-5.jpg)