నమ్మకాన్ని పునరుద్ధరించిన తీర్పు!

peoples democracy article on bilkis-bano supreme court verdict on case

బిల్కిస్‌ బానో కేసులో ఇటీవల వచ్చిన తీర్పు కోసం చాలా మంది ఆతృతగా ఎదురుచూశారు. న్యాయాన్ని అందించగల సామర్ధ్యం న్యాయ వ్యవస్థకు వుందన్న ఆశలు అణచివేయబడతాయా లేక మరింత ప్రకాశవంతంగా జ్వలిస్తాయా అన్న అంశంపై అగ్ని పరీక్ష మాదిరిగా ఈ తీర్పును అందరూ పరిగణించారు. మానవాళిపై అత్యంత హేయమైన నేరాలకు పాల్పడిన, గుజరాత్‌ ప్రభుత్వం శిక్ష తగ్గింపు చర్యల్లో భాగంగా విడుదల చేసిన 11 మంది దుండగులు జైలు నుండి బయటకు రాగానే వారికి పూలదండలు వేసి, వారిని ‘సంస్కారవంతమైన బ్రాహ్మణులు’గా కీర్తించిన 2022 ఆగస్టు 15న ఈ ఆశలన్నీ పూర్తిగా నీరుగారిపోయాయి. మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడలేని వారిపై…ఎర్రకోట పైనుండి చేసిన ప్రసంగంలో ప్రధాని విమర్శించడానికి ముందే…ఈ ఘటన చోటు చేసుకుంది.

2002 అల్లర్ల సమయంలో, హింస జరుగుతుందనే భయంతో గ్రామం వీడి పారిపోతున్న నాలుగు మాసాల గర్భవతి అయిన 21 ఏళ్ళ బిల్కిస్‌ బానోను, ఆమె కుటుంబాన్ని ఈ దుండగులు వెంబడించారు. ఒక రోజు తర్వాత నిస్సహాయులైన వారిని చుట్టుముట్టారు. బిల్కిస్‌ బానో మూడేళ్ల కుమార్తెను, అంతకుముందు రోజే పుట్టిన ఆమె మేనల్లుడిని దారుణంగా చంపివేశారు. ఆమెపై, ఆమె తల్లిపై, మరదలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారందరినీ కిరాతకంగా హత్య చేశారు. కేవలం బిల్కిస్‌ బానో మాత్రమే బతికి బయటపడ్డారు. గోద్రాలో ఏర్పాటు చేసిన అల్లర్ల బాధితుల శిబిరానికి పోలీసులు ఆమెను చేర్చారు. ఆమె అనుభవించిన భయంకరమైన ఆ దారుణాలు, ఆటవిక చర్యలు అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఊహించని రీతిలో ఎదురైన అడ్డంకులు, అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ న్యాయం కోసం ఆమె సాగించిన సాహసోపేతమైన పోరాటానికి మానవ హక్కుల కార్యకర్తలు, గ్రూపులు, న్యాయవాదుల మద్దతు లభించింది. నిందితులకు ఇవ్వాల్సిన ప్రతి రక్షణనూ గుజరాత్‌ ప్రభుత్వం అందచేసింది. మహారాష్ట్రలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు ఈ కేసు బదిలీ అయిన తర్వాత మాత్రమే 2008లో నిందితులను దోషులుగా నిర్ధారించారు. 2017లో, మహారాష్ట్ర హైకోర్టు వారి నేర నిరూపణను, వారికి విధించిన యావజ్జీవ శిక్షను సమర్ధించింది. అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కనుసన్నల్లో ముస్లిం కమ్యూనిటీపై సంఘ పరివార్‌ సాగించిన హత్యాకాండకు సంబంధించిన వేలాది కేసుల్లో కనీసం ఒక్కదాంట్లోనైనా న్యాయం జరిగినట్లు కనిపించింది. దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ, ఇక వరుసగా మహిళా రాజకీయ కార్యకర్తలు, విద్యావేత్తలు, రిటైర్డ్‌ మహిళా ఐపిఎస్‌ అధికారి, తర్వాత బిల్కిస్‌ బానో వరుసగా సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. గుజరాత్‌, కేంద్ర ప్రభుత్వాలు వారి విడుదలను పూర్తిగా, ధాటిగా సమర్ధించుకున్నాయి. ఎట్టకేలకు, ఈ ఏడాది జనవరి 8న జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌లతో కూడిన బెంచ్‌ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ తీర్పును వెలువరించింది. 15 రోజుల వ్యవధిలో ఆ 11 మంది రేపిస్ట్‌లు, హంతకులు తిరిగి జైలుకు వెళ్ళాలని ఆదేశించారు. న్యాయం కోసం జరిపే పోరాటాలు విజయవంతమవుతాయనే ఆశను పునరుద్ధరించడంలో ఈ తీర్పు ఎంతగానో ఉపకరించింది.

దోషులు చేసిన నేరాలను ‘ఘాతుకాలుగా, దౌర్జన్యాలుగా’ ఆ తీర్పు అభివర్ణిస్తూ, గుజరాత్‌ ప్రభుత్వం పాల్పడిన అనేక తప్పుడు చర్యలకు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. అయితే, అసాధారణమైన పరిస్థితుల ప్రాతిపదికగా ఈ శిక్ష తగ్గింపు చర్య చెల్లదంటూ, ‘గుజరాత్‌ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనే కారణాలపై ఈ శిక్ష తగ్గింపు ఆదేశాలను కొట్టివేస్తున్నాం.’ అని న్యాయమూర్తులు తమ తీర్పులో స్పష్టం చేశారు. ఈ తీర్పును ప్రకటించడానికి దారి తీసిన అసాధారణ పరిస్థితులు ఈ కింది విధంగా వున్నాయి: 2019లో నిందితుల్లో ఒకరైన రాధేశ్యామ్‌ తనకు విధించిన శిక్షను తగ్గించాలని కోరుతూ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే దోషిగా నిర్ధారించిన మహారాష్ట్ర కోర్టే దీన్ని విచారించాలని పేర్కొంటూ ఆ పిటిషన్‌ను కొట్టివేశారు. ఈ ఆదేశాలపై గుజరాత్‌ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయలేదు. పైగా రాధేశ్యామ్‌ తనకు శిక్ష తగ్గించాలని కోరుతూ మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో దోషిగా నిర్ధారించిన సిబిఐ కోర్టు మేజిస్ట్రేట్‌, వారు (రాధేశ్యామ్‌, ఆయన సహ నిందితుడు) పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించారు. ఈ కేసును విచారించిన పోలీసు అధికారి కూడా తిరస్కరించారు. ఇదంతా అయిన తర్వాత, రాధేశ్యామ్‌, గుజరాత్‌ ప్రభుత్వం 2021లో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. గుజరాత్‌, మహారాష్ట్రల్లో గతంలో ఏం జరిగిందో కోర్టుకు తెలియచేయకుండానే ఈ శిక్ష తగ్గింపు పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు విచారించాలని కోరుతూ పెట్టుకున్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలంటూ కోరాయి. ఈ కేసును విచారించిన బెంచ్‌, శిక్ష తగ్గింపు పిటిషన్‌ను విచారించేందుకు గుజరాత్‌ హైకోర్టుకు మాత్రమే అధికారం వుందని రూలింగ్‌ ఇవ్వడమే కాకుండా, దీన్ని 1992 నాటి ప్రభుత్వ శిక్ష తగ్గింపు విధానం కింద పరిశీలించాలని, అంతేకానీ 2014 నాటి సవరించిన విధానం కింద కాదని కూడా స్పష్టం చేసింది. సవరించిన 2014 విధానం ప్రకారం మరణశిక్ష పడిన వారికి శిక్ష తగ్గింపు ఉపశమనం లభించదు. అయితే, 1992 విధానం కింద ఇది సాధ్యమవుతుంది.

ఈ తీర్పు వచ్చిన తర్వాత, గుజరాత్‌ ప్రభుత్వం వెంటనే ఈ దోషులకు శిక్ష తగ్గింపు అమలు చేయడానికి అవసరమైన చర్యలన్నింటినీ హడావిడిగా పూర్తి చేసింది. అప్పటికే అమల్లో వున్న నిబంధనలను, విధి విధానాలను గాలికి వదిలేసింది.

రాధేశ్యామ్‌, గుజరాత్‌ ప్రభుత్వం కోర్టుకు తెలియచేయాల్సిన ముఖ్యమైన వాస్తవాలను వెల్లడించకుండా దాచిపెట్టి, సుప్రీం కోర్టు 2021లో ఇచ్చిన తీర్పును అక్రమ మార్గాల ద్వారా రాబట్టారని జనవరి 8 నాటి తీర్పు నిర్ధారణకు వచ్చింది. ”2022 మే 13న ఈ కోర్టు ఇచ్చిన తీర్పు కోర్టు దృష్టిలో చెల్లదని మేం అభిప్రాయపడుతున్నాం. పర్యవసానంగా, గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, దాని అధికార పరిధిని, విచక్షణను దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదు…ఈ కోర్టు జారీ చేసిన ఆదేశాలను, చట్ట నిబంధనలను అతిక్రమించేందుకు సాధనంగా ఉపయోగించుకోవడానికి ఈ కేసు ఒక చక్కటి ఉదాహరణగా వుంది. అందువల్ల, శిక్ష తగ్గింపు అధికారాన్ని ఉపయోగించిన తీరును పరిశీలించకుండానే, గుజరాత్‌ ప్రభుత్వం తనకు దఖలు పరచని అధికారాలను కూడా దుర్వినియోగం చేసిందనే కారణాలతో ఈ శిక్ష తగ్గింపు ఆదేశాలను మేం కొట్టివేస్తున్నాం. ఈ ప్రాతిపదికనే శిక్ష తగ్గింపు ఆదేశాలు రద్దవుతాయి.”ఈ నేరస్తులకు గుజరాత్‌ ప్రభుత్వం మొదటి నుండి సహకరిస్తూనే వచ్చిందని, అందువల్లనే ఈ కేసును మహారాష్ట్రకు బదిలీ చేయాల్సి వచ్చిందని, పైగా 2021లో సుప్రీం కోర్టుపై జరిగిన మోసం, అక్రమాల్లో కూడా గుజరాత్‌ ప్రభుత్వ ప్రమేయం వుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడుతోందనే వాస్తవాన్ని ఇక్కడ నొక్కి చెప్పడం కీలకంగా వుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఖూనీకోర్లకు తన వంతు పూర్తి మద్దతును అందించింది. సుప్రీం కోర్టు ఇంత తీవ్రమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా గుజరాత్‌, కేంద్ర ప్రభుత్వాల తరపు ప్రతినిధులెవరూ ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. దీంతో బిజెపి వాస్తవిక మనువాదీ ముఖం నగంగా బయటపడింది. శిక్షకు దొరక్కుండా, మహిళలపై, ప్రజలపై బిజెపి మద్దతుదారులు పాల్పడుతున్న హేయమైన నేరాలను తప్పనిసరిగా గుర్తించాలి. భిన్న గ్రూపుల మధ్య ఇలాంటి విద్వేషాన్ని సృష్టించే అస్తిత్వవాద రాజకీయాలను వారు క్షమించడమే కాకుండా, ఇతరులపై తమ వారు చేసే నేరాలను కూడా పండుగలా జరుపుకోవడాన్ని తప్పనిసరిగా వ్యతిరేకించాలి.

 

( ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

 

➡️