ప్రైవేటు ఫీజులు – ప్రభుత్వ నియంత్రణ ?

Mar 6,2024 07:20 #Editorial

 ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, విద్యావేత్తలు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌, జడ్జి కమిటీ సభ్యులుగా ఉన్న ‘డిస్ట్రిక్ట్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ’ ఫీజులను నియంత్రణ చేసే నియంత్రణ వ్యవస్థ ఉండాలి. పాఠశాలలను దుకాణాలుగా మార్చి టై, బెల్ట్‌, పాఠ్యపుస్తకాలు అమ్మడంపైనా నియంత్రణ చేయాలి. ప్రత్యేక చట్టాన్ని ఆమోదించి ప్రతి సంవత్సరం ఫీజులను పక్కాగా అమలు చేయాలి. ప్రభుత్వ పర్యవేక్షణ పెంచాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను ధిక్కరించిన సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలి. ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, చిన్న విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా ఉద్యమం చేపట్టాల్సి బాధ్యత ఉంది.

 రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. కార్పొరేట్‌ స్కూళ్లల్లో ఎల్‌కేజీ ఫీజులే సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర మధ్యలో వసూలు చేస్తున్నారు. ఇంకా విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లోనైతే అప్పుడే అడ్మిషన్లు పూర్తయినట్లు చెబుతున్నారు. తమ పిల్లలను నాణ్యమైన చదువులు చదివించాలన్న తల్లిదండ్రుల కోరిక ప్రైవేట్‌ విద్యా సంస్థలకు మంచి అవకాశంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి అక్రమ వసూళ్లకు తెర తీశారు. పట్టణాల్లో చదవాలంటే హాస్టలు వసతి కూడా వారికి అవసరమవుతుంది. దీంతో స్కూలు, హాస్టల్‌ పేరుతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు, ఆ తర్వాత విద్యార్థులకు పాఠశాలను బట్టి రూ. 60 వేల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు తాము తక్కువ కాదంటూ కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు ఇదే సంప్రదాయానికి దిగాయి. సాధారణ చదువులతో ఐఐటి ఫౌండేషన్‌ అంటూ మరికొంత నొక్కుతున్నాయి. దీంతో విద్యార్థులను స్కూళ్లలో చేర్పించేందుకు వచ్చి, వెనక్కి వెళ్ళలేక చేర్పించే సాహసం చేయలేక తలిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.

విద్యాహక్కు చట్టం అమలు తుంగలోకి…

                  విద్యాహక్కు చట్టం సెక్షన్‌-6 ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాలి. సెక్షన్‌-11 ప్రైవేటు యాజమాన్యాలు గవర్నింగ్‌ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. సెక్షన్‌ 1, 2 ప్రకారం స్కూల్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను నియమించి వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరాలను నోటీస్‌ బోర్డ్‌లో పెట్టాలని చట్టం చెబుతుంది. సెక్షన్‌-12 ప్రకారం టీచర్‌, విద్యార్థుల నిష్పత్తి 1:20కి మించరాదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమాన్యం 25 శాతం సీట్లను ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులకు, మైనారిటీలకు కేటాయించాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్‌ బుక్స్‌, యూనిఫారాలు, స్కూల్‌ బ్యాగులు, ఇతర స్టేషనరీని అమ్మరాదు. ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా సూచించరాదు. విద్యార్థుల ఫీజు వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలి. ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో పాఠశాలల్లో 1000 చదరపు మీటర్ల ఆటస్థలం, గ్రామీణ ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి. పాఠశాల యాజమాన్యం అభం శుభం తెలియని చిన్నారుల చేతికి స్కూల్‌ ఫీజుల రసీదులు ఇస్తున్నది. మీ అమ్మనాన్న ఇంకా ఫీజు చెల్లించలేదంటూ వారిని కించ పరుస్తున్నారు. ఫీజు స్లిప్పులను చిన్నారుల చేతికిస్తే జరిమానా ఉంటుంది. అనుమతులు లేకుండా స్కూళ్లను ప్రారంభించ కూడదు. ప్రభుత్వ అనుమతి తోనే ప్రారంభించాలి. ఆరు నెలల్లోపు అనుమతులు పొందాలి. భవనానికి ప్రహరీ ఉండి, గాలి వెలుతురు బాగా వచ్చేలా ఉండాలి. చిన్నారులు నిద్రపోవడానికి ప్రత్యేకంగా విశ్రాంతి గది ఉండాలి. మరుగుదొడ్లు, స్నానాల గదిలో టవలు, సబ్బులు ఉంచి, పరిశుభ్రత చర్యలు పాటించాలి. ప్లే స్కూల్‌కు తప్పనిసరిగా ప్లే స్కూల్‌ అని బోర్డు పెట్టాలి. ప్రవేశాలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల కమిటీని నెలలోపు నియమించాలి. ఈ కమిటీని ఏటా మారుస్తుండాలి. ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను నమోదు చేయాలి. పిల్లలకు జంక్‌ఫుడ్‌ను అనుమతించకూడదు. పోషకాలతో కూడిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. ఇటువంటి నిబంధనలు చాలా స్కూళ్లు పాటించకుండా నడుపుతున్నాయి. ప్రతి జిల్లాకు జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేసి, ఫీజులను నియంత్రించే ఆలోచన చేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పాఠశాలల గుర్తింపును రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలి.

తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదువులు చెప్పించాలనే ఉద్దేశంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్‌ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి, వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న స్థితి తెలుగు రాష్ట్రాలలో నెలకొంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా తమ రూల్‌ తమదే అనేలా కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లు ప్రవర్తిస్తున్నాయి. కొన్ని స్కూళ్లయితే ఒకేసారి మొత్తం అడ్మిషన్‌ ఫీజు, పాఠశాల ఫీజు కట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వబోమంటూ విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 2024-25కి గాను పలు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు భారీగా పెంచాయి. ప్రస్తుతం ఉన్న ఫీజుల కంటే ఎక్కువగా 10 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతోంది. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం వార్షిక పరీక్షలు ఇంకా ముగియక ముందే వచ్చే ఏడాదికి కట్టాల్సిన స్కూల్‌ ఫీజుల విషయంలో కొన్ని కార్పొరేట్‌, ప్రవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్‌ మెసేజ్‌లు, నోటీసులు, మెయిళ్లు పంపడం గమనార్హం. కొత్తగా తీసుకునే అడ్మిషన్లు గడువు తేదీలు ముగిశాయి. విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా స్క్రీనింగ్‌ టెస్టులు, తల్లిదండ్రులు ఇంటర్వ్యూల ఆధారంగా వారు చేస్తున్న ప్రొఫెషన్‌ తెలుసుకుని వివక్షాపూరితంగా వ్యవహరిస్తూ అసమానతలు పెంచుతున్నారు.

ఫీజులపై నియంత్రణ ఏది ?

                  ప్రైవేటు, కార్పొరేట్‌ ఫీజుల నియంత్రణ కోసం అన్ని రకాల ఉత్తర్వులూ వున్నాయి. కానీ ఆచరణలో అవన్నీ ఉత్తవే. 1994లో వచ్చిన జీవో నెం-1 ప్రైవేటు పాఠశాలలు స్థాపన, నిర్వహణ, అడ్మిషన్లు, ఫీజులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ, తనిఖీలు తదితర విధివిధానాలను స్పష్టం చేస్తున్నాయి. వాటిని అమలు చేయలేమని ప్రైవేటు విద్యాసంస్థలు చెప్పేస్తున్నాయి. 2009లో వచ్చిన జీవో నెం-91లో ఫీజు స్ట్రక్చర్‌ నిర్వచించబడింది. వాటిని అమలు చేయకుండా ప్రైవేటు యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్ధుల చదువు కోసం విద్యాహక్కు చట్టం కల్పించిన ఉచిత విద్యకు తీసుకొచ్చిన జీవో నెం 46/2010పై కూడా కోర్ట్‌ స్టే తీసుకుని వచ్చారు. పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు వినియోగించడం లేదు. షూ, టై, బెల్టు అమ్మే వ్యాపార కేంద్రాలుగా పాఠశాలలు మారినా చర్యలు తీసుకోకుండా అధికారులు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఫీజుల నియంత్రణకై అనేక వాదనలు జరుగుతున్నాయి. అటానమస్‌ హోదా కల్గిన విద్యాసంస్థలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని యాజమాన్యం వాదనలు వినిపిస్తున్నాయి. 2002లో ”టి.ఎ.పారు. వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం” 2003లో ”ఇస్లామిక్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం”, 2004లో ”మోడరన్‌ స్కూల్‌ వర్సెస్‌ ఢిల్లీ ప్రభుత్వం”, 2005లో పి.ఎ.ఇనాందారి వర్సెస్‌ మహారాష్ట్ర ప్రభుత్వం” కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులలో చాలా స్పష్టత వచ్చింది. నాన్‌ ప్రాఫిట్‌ సంస్థలైన ప్రైవేటు విద్యాసంస్థలు క్యాపిటేషన్‌ ఫీజులు వసూలు చేయకుండా సరైన యంత్రాంగం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సుప్రీం తెలిపింది. కానీ ఈ మార్గదర్శకాలు ఎక్కడా అమలు కావడం లేదు.

నియంత్రణ చట్టం అవశ్యం

               ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్ధాన్‌, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణలో కూడా ఇదే బాట పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. దాదాపు 11 వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించింది. కానీ ఆచరణలో గత ప్రభుత్వం ఈ కృషి చేయలేదు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 19(1) ప్రకారం విద్యను ఉచితంగా అందించాలి. ప్రైవేటు విద్యాసంస్థల నిర్వహణలో ఉపాధ్యాయుల జీతాలు ఉంటాయి కాబట్టి…ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆయా సంస్థల ఎకౌంట్లను సమగ్రంగా పరిశీలించి సరైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే నిర్వహణ ఖర్చులు 15 శాతం మించకుండా పెంచుకునేలా చట్టం చేయాలి. ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, విద్యావేత్తలు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌, జడ్జి కమిటీ సభ్యులుగా ఉన్న ‘డిస్ట్రిక్ట్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ’ ఫీజులను నియంత్రణ చేసే నియంత్రణ వ్యవస్థ ఉండాలి. పాఠశాలలను దుకాణాలుగా మార్చి టై, బెల్ట్‌, పాఠ్యపుస్తకాలు అమ్మడంపైనా నియంత్రణ చేయాలి. ప్రత్యేక చట్టాన్ని ఆమోదించి ప్రతి సంవత్సరం ఫీజులను పక్కాగా అమలు చేయాలి. ప్రభుత్వ పర్యవేక్షణ పెంచాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను ధిక్కరించిన సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలి. ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, చిన్న విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా ఉద్యమం చేపట్టాల్సి బాధ్యత ఉంది.

/ వ్యాసకర్త ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెల్‌ : 9490098292/ టి. నాగరాజు
/ వ్యాసకర్త ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెల్‌ : 9490098292/ టి. నాగరాజు
➡️