తమిళ హీరో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన సినిమా లాల్సలామ్. విష్ణు విశాల్ హీరోగా నటించారు. రజనీకాంత్ అతిథిపాత్రలో నటించారు. చెన్నైలో శనివారంనాడు లాల్సలామ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. రజనీపై వస్తున్న ట్రోల్స్ గురించి ఐశ్వర్య స్పందించారు. ‘సోషల్ మీడియాకు నేను చాలా దూరంగా ఉంటా. ఆన్లైన్ నెగెటివిటీ గురించి నా టీమ్ తరచూ చెబుతుంటుంది. వాటివల్ల నేను ఆగ్రహానికి గురైన సందర్భాలూ ఉన్నాయి. మేమూ మనుషులమే. మాకూ భావోద్వేగాలుంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేవారిని అలా పిలుస్తారని తెలుసుకున్నా. రజనీకాంత్ సంఘీకాదు. అలా అయితే…ఆయన ‘లాల్ సలామ్’లో నటించేవారు కాదు’ అని పేర్కొన్నారు. అదే వేదికపైన ఉన్న రజనీకాంత్ కుమార్తె మాటలు విని కన్నీటిపర్యంతమయ్యారు.